Chandrayaan-3లో రేపు జరగబోయేది ఇదే.. ఆ కొన్ని నిమిషాలు ఎంతో కీలకం..!
అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధం అయింది. జూలై 14 ఇస్రో ప్రయోగించిన Chandrayaan-3 బుధవారం సాయంత్రం 06:04 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. చంద్రయాన్-2లో ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. చంద్రయాన్-3ను అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా రూపొందించింది.
అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై అమెరికా, రష్యా, చైనా తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా ఇస్రో చరిత్ర సృష్టించనుంది. అనంతరం అక్కడ కీలక పరిశోధనలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. సుమారు 14 రోజులపాటు పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చంద్రుడి 25*134 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్టు 23 సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్ మిషన్ను ప్రారంభించాలని అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భావిస్తోంది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను నాలుగు వేర్వేరు దశలుగా ఇస్రో విభజించింది.
మొదటి దశ రఫ్ బ్రేకింగ్.. విక్రమ్ ల్యాండర్ రేపు సాయంత్రం 5:47 నిమిషాలకు ల్యాండింగ్ జోన్ నుంచి 745 కి.మీ దూరంలో 30 కి.మీ ఎత్తులో ఉంటుంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ గంటకు 1.68 కిలోమీటర్ల వేగంతో లక్ష్యం వైపు కదులుతూ ఉంటుంది. మరియు అదే ఎత్తులో కొనసాగుతుంది.

అదే సమయంలో ఇంజిన్లు ల్యాండర్ ఎత్తును తగ్గించేందుకు యాక్టివేట్ చేయబడతాయి. మరియు ఎత్తు సెకనుకు 60 మీటర్ల చొప్పున తగ్గుతుంది. అలా 690 సెకన్లపాటు కిందకు దిగుతుంది. అదే సమయంలో లక్ష్యం వైపు దాని వేగాన్ని తగ్గిస్తుంది. అలా ల్యాండర్ 30 కి.మీ ఎత్తు నుంచి 7.42 కి.మీ చేరుకుంటుంది.
తర్వాత రెండో దశను ఆల్టిట్యూడ్ హోల్డ్ అంటారు. అంటే ల్యాండర్ 7.42 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఎత్తు మరింత తగ్గకుండా చూస్తుంది. చంద్రయాన్-2లో ల్యాండర్ నేరుగా మలుపు తిరగవలసి వచ్చింది. అందుకే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. చంద్రయాన్-3లో మాత్రం అలాంటి సమస్యలకు ఇస్రో చెక్ పెట్టనుంది.
ఇందులో ల్యాండర్ దాని స్థానాన్ని పక్కకు తిరిగి నిటారుగా మార్చడానికి ముందు దాని లక్ష్యానికి 3.48 కి.మీ దగ్గరగా ఉంటుంది. అదే సమయంలో దాని ఎత్తును 7.42 కి.మీ ఎత్తు నుంచి 6.8 కి.మీలకు తగ్గించుకోనుంది. అప్పుడే సెకనుకు 336 మీటర్ల వేగంతో లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది. మరియు సెకనుకు 59 మీటర్ల వేగంతో ఎత్తును తగ్గిస్తుంది.
ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ మూడో దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశ 175 సెకన్లపాటు ఉంటుంది. ఈ దశలో విక్రమ్ ల్యాండర్ గ్రౌండ్ ఆపరేషనల్ ఏరియా నుంచి 28.58 కి.మీ దూరంలో ఉంటుంది. మరియు ఎత్తును కూడా తగ్గించుకుంటుంది. అప్పుడే విక్రమ్ ల్యాండర్ సెన్సార్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ల్యాండింగ్ సైట్ను పరిశీలిస్తూ నెమ్మదిగా దిగుతుంది.
విక్రమ్ ల్యాండర్ సరిగా 150 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు.. సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ల్యాండింగ్ చేయాలా వద్ద అనేది నిర్ణయిస్తుంది. ఎలాంటి సమస్య లేకుండా ల్యాండింగ్ కావాలని భావిస్తే.. క్రమంగా ఎత్తును తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలం వైపు వెళ్తుంది.
లేదా వేరే చోటికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే ఇంజిన్లను యాక్టివేట్ చేసి మరో వైపునకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ల్యాండర్ ఎత్తు తగ్గినప్పుడు చంద్రుని వైపు విక్రమ్ ల్యాండర్ వేగం కూడా గణనీయంగా తగ్గుతుంది. అన్ని సక్రమంగా జరిగిదే.. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది.
చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3లో అనేక మార్పులు చేశారు. ఇంజిన్ల దగ్గర నుంచి సెన్సార్లు, కెమెరాలను వరకు అన్నింటా కీలక మార్పులు చేశారు. మరియు డిజైన్లోనూ చాలా మార్పులు చేశారు. వేగంగా ల్యాండింగ్ జరిగినా ల్యాండర్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజైన్ చేశారు.
చివరి క్షణలో సెన్సార్లు విఫలం అయినా.. ఇంజిన్లు ఎటువంటి సమస్య లేకుండా పనిచేయగలవు. మరియు ల్యాండర్ను సురక్షితంగా ల్యాండింగ్ చేయగలవు. ల్యాండర్లో అమర్చిన నాలుగు ఇంజిన్లలో రెండు ఫెయిల్ అయినా.. ల్యాండింగ్కు సమస్య ఉండదు. అన్ని సక్రమంగా జరిగితే భారత్, ఇస్రో కీర్తి ప్రపంచవ్యాప్తం అవుతుంది.


Click it and Unblock the Notifications








