విమానంలో ప్రయాణించేటప్పుడు మీ సెల్ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమన్నారా? ఎందుకో తెలుసా?
మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించి ఉంటే, సదరు విమానం గాలిలోకి ఎరిగేటప్పుడు కానీ లేదా నేలపైకి దిగేటప్పుడు కానీ అందులో ఉండే ఫ్లైట్ అటెండెంట్లు మీ సెల్ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయమని లేదా ఎరోప్లెయిన్ మోడ్లో ఉంచమని మిమ్మల్ని పదే పదే కోరుతారు. మరి దీని వెనుక ఉన్న కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా?

విమానం టేకాఫ్ మరియు ల్యాండిగ్ సమయాల్లో, అందులోని ప్రయాణీకులు ఉపయోగించే సెల్ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరా? నిజానికి, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం, విమానంలో వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని అధికారికంగా నిషేధించలేదు. మరి ఫ్లైట్ అటెండెంట్లు మాత్రం ఎందుకు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు? ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భద్రతా కారణాల దృష్ట్యా విమానంలో వివిధ రకాల నిబంధనలు పాటిస్తారు. వీటిలో కొన్ని మనకు చాలా వింతగా అనిపించవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికాల వినియోగంపై నిషేధం. సెల్ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు విడదల చేసే రేడియో తరంగాలే ఇందుకు ప్రధాన కారణం.

సెల్ఫోన్లతో పాటుగా దాదాపుగా అన్ని పర్సనల్ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. సిద్ధాంతపరంగా చూస్తే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు మరియు విమానంలోని నావిగేషనల్ ఉపకరణానికి అవసరమైన రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

ఇది విమాన కాక్పిట్లోని ఏరోనాటికల్ పరికరాలకు అంతరాయం కలిగించవచ్చు. అంతేకాకుండా, మీరు అధిక ఎత్తులో ఎగురుతున్నప్పుడు, సెల్ ఫోన్లు బలమైన సిగ్నల్స్ పంపుతాయి, తద్వారా ఇది భూమిపై నెట్వర్క్ రద్దీకి కూడా కారణం అవుతుంది.

ఈ కారణం చేతనే, విమానం టేకాఫ్ మరియు ల్యాండిగ్ సమయాల్లో, అందులోని ప్రయాణీకులు ఉపయోగించే సెల్ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయమని ఫ్లైట్ సిబ్బంది కోరుతారు. అయితే, ఇలా విమానాల్లో సెల్ఫోన్లు మరియు వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వలన జరిగే సిగ్నల్ జోక్యం కారణంగా విమాన ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు.

వాస్తవానికి, ఇప్పుడు అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా అందిస్తున్నాయి. విమానంలోని ప్రయాణీకులు ఎవరైనా వై-ఫైకి కనెక్ట్ కావాలంటే, వారు తమ పరికరాన్ని తప్పనిసరిగా రేడియో తరంగాల ద్వారా అనుసంధానించాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా విమానం గాలిలో ఉన్నప్పుడు కలగని సిగ్నల్ అంతరాయం, సదరు విమానం ఎగిరేటప్పుడు లేదా దిగేటప్పుడు మాత్రమే ఎలా కలుగుతుంది?

ఇప్పటికీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. నిజానికి, ఈ నిబంధన ఓ ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే సృష్టించబడింది. విమాన ప్రయాణంలో టేకాఫ్ మరియు ల్యాండింగ్ అనేవి రెండూ కూడా చాలా కీలకమైన దశలు. కాబట్టి, ఈ సందర్భంలో విమానంలోని ప్రయాణీకులంతా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండేందుకే ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

కాబట్టి, మీరు కూడా ఎప్పుడైనా విమానంలో ప్రయాణించాల్సి వస్తే, తప్పనిసరిగా మీ సెల్ఫోన్లు మరియు వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయటం లేదా వాటిని ఏరోప్లెయిన్ మోడ్లో ఉంచటం చేయండి. ఎందుకంటే, ప్రమాదం జరిగాక సారీ అని ఫీల్ అవడం కన్నా సేఫ్గా ఉండటం మంచిదే కదా? మీరేమంటారు?


Click it and Unblock the Notifications








