అనుమతి లేని బ్రిడ్జిపై యువతి బైక్ రైడ్.. ప్రశ్నించినందుకు పోలీసులతో గొడవకు దిగిన యువతి, వీడియో వైరల్
దేశంలో మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎక్స్ప్రేస్లు వే, ఫ్లై ఓవర్లు, నిర్మిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయం తెలియని ఓ యువతి అనుమతి లేని బ్రిడ్జి(Bridge)పై ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కింది. ఈ వీడియో వైరల్గా మారింది.
కార్లు, భారీ ట్రక్కులు ఎక్స్ప్రెస్వే(Express Way)లపై హై స్పీడ్తో వెళ్తుంటాయి. వాటితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు స్లోగా వెళ్తాయి. ఈ నేపథ్యంలో వేగంగా వెళ్లే ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రమాదం జరగకుండా నిరోధించేందుకు ద్విచక్ర వాహనాలను నిషేధించారు. అయితే తాజాగా జరిగిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది.

ముంబయిలోని బాంద్రా-వర్లీ(Bandra Worli Sea Link Road) సీ లింక్ రోడ్డు దేశంలో ద్విచక్ర వాహనాలు నిషేధించబడిన వంతెనలలో ఒకటి. ఇది నగరంలో సముద్రం మీద నిర్మించిన వంతెన. బైక్లు, స్కూటర్లు ఈ వంతెనపై వెళ్లకుండా ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ విషయం తెలియక కొద్ది రోజుల క్రితం ఓ యువతి బైక్పై ఈ బ్రిడ్జిపైకి వచ్చింది.
యువతి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నుబుర్ పటేల్. 26 ఏళ్ల నుబుర్ పటేల్ ముంబయిలో నివాసం ఉంటున్న తన సోదరుడిని కలిసేందుకు వచ్చింది. అయితే ఆమె వేరే రాష్ట్రం నుంచి రావడంతో బ్రిడ్జిపై టూవీలర్లకు అనుమతి లేదన్న సంగతి తనకు తెలియదు. దీంతో తన సోదరుడి ఇంటికి వెళ్లే దారిలో ఉన్న బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జిపై రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield Bike) బైక్పై వెళ్లింది.

అయితే బ్రిడ్జి ప్రారంభంలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఆమె పట్టించుకోకుండా నుబుర్ పటేల్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బ్రిడ్డి ఎక్కింది. ఆమె బైక్పై వంతెన మీదకు రావడాన్ని తోటి వాహనదారులు వింతగా చూశారు. బైక్పై యువతిని గమనించిన ముంబయి ట్రాఫిక్ పోలీసు అధికారి ఆమెను ఆపి విచారించారు.
ఈ క్రమంలో పోలీసులు ఆమెను ఈ మార్గంలో ఎందుకు వచ్చారని విచారిస్తుండగా పోలీసులతో ఆమె వాగ్వాదానిక దిగింది. దీంతో ముంబయి ట్రాఫిక్ పోలీసులు నుబుర్ పటేల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె దగ్గర తుపాకీ లాంటి ఒక వస్తువును పోలీసులు గుర్తించారు. దీంతో అవాక్కవ్వడం ముంబయి పోలీసుల వంతయింది.

అయితే అది తుపాకీ కాదు, లైటర్ అని ఆ యువతి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు దానిని కూడా సీజ్ చేశారు. కాగా ముంబయి ట్రాఫిక్ పోలీస్ అధికారితో నుబుర్ పటేల్ గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారి గొడవతో బ్రిడ్జిపై కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
బ్రిడ్జిపైకి నిషేధం ఉందని తెలియకపోయినా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో యువతిని మంబయి ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువతి ప్రవర్తనతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చట్టం ప్రకారం అందరూ సమానమే కాబట్టి రోడ్డుపై ఎవరికీ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.

అందరూ సక్రమంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితేనే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మీరు కొత్త నగరాలు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రధాన రోడ్లు, ఫ్లై ఓవర్లు, వంతెనలపై అనుమతి ఉందో తెలుసుకోవాడం ముఖ్యం. లేదంటే చిక్కులు తప్పవు.
మీరు మీకు తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ వన్-వే రోడ్ల గురించి కూడా తెలుసుకోవాలి. మీకు వాటి గురించి పూర్తిగా తెలియకపోతే అలాంటి రోడ్లపై వాహనాన్ని నడపడానికి ప్రయత్నించవద్దు. అలాంటి సందర్భాల్లో తెలియకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే అక్కడ చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదు.


Click it and Unblock the Notifications








