ఆర్టీసీ బస్సులో కొట్టుకున్న మహిళలు.. మధ్యలో ఆపేందుకు వచ్చిన యువకుడిపై దాడి.. వైరల్ అవుతున్న వీడియో
కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలో శక్తి యోజన కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బస్సులన్నీ మహిళలతో నిండిపోవడంతో బస్సులో అడుగు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా చాలా బస్సుల్లో సీట్ల కోసం గొడవ కూడా జరుగుతోంది.
ఇటీవల కర్ణాటకలోని మైసూరులో కేఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలు సీట్ల కోసం గొడవపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చూడటానికి ఈ వీడియో తమాషాగా ఉన్నా, ఈ గొడవలతో ఉచిత బస్సు ప్రయాణం పథకం దుర్వినియోగం అవుతుందేమోనని ఆందోళనలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

మైసూరులోని ప్రభుత్వ సిటీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని మహిళలు కొట్లాడుకున్న ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం మహిళలు గొడవ పడుతుండటాన్ని బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, నెటిజన్ల నుంచి వివిధ రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మైసూర్ బస్టాండ్ నుంచి చాముండి కొండకు వెళ్తున్న బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్టాండ్లో బస్సు నిలబడి ఉండగా, వేచి చూస్తున్న ఓ మహిళ బస్సు రాగానే బస్సు బయట నుంచి కిటికీలోంచి తన దుపట్టాను వేసి, అందరిలాగే తన సీటును రిజర్వ్ చేసుకుంది. అనంతరం ఎలాగోలా కష్టపడి బస్సు ఎక్కింది.

అయితే ఆ మహిళ ఆ బస్సు ఎక్కేసరికి అప్పటికే మరో మహిళ ఆ సీటుపై ఉన్న దుపట్టాను తీసివేసి ఆ సీటులో కూర్చుంది. దీంతో సదరు మహిళ ఆ సీట్లోంచి లేవమని చెప్పడంతో ఆమె లేవలేదు. దీంతో అక్కడ గొడవ చోటుచేసుకుంది. ఈ ఇద్దరితో పాటు వచ్చిన ఇతర మహిళలు తమ స్నేహితురాళ్లకు మద్దతుగా నిలవడంతో గొడవ కాస్త పెద్దదైంది. దీంతో బస్సులో వీరి గొడవ వీరంగం సృష్టించింది.
అయితే బస్సులో ఇంత గొడవ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఓ యువకుడు ముందుకు వచ్చి ఆ గొడవను ఆపేందుకు యత్నించాడు. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న మహిళలు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఖంగు తిన్న యువకుడు ఏం చేయాలో తోచక వారి చేతుల్లో నుంచి తప్పించుకుని వెనుదిరిగాడు.
ఇంత జరుగుతున్నా బస్సులో డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వారి గురించి పట్టించుకోకుండా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వారి గొడవను ఆపకుండా మౌనం వహించారు. వారి గొడవతో ఇబ్బంది పడుతున్న ఇతర ప్రయాణికులు ఆ రాద్దాంతాన్ని ఆపాలని కండక్టర్ను వేడుకున్నారు. కండక్టర్ సదరు మహిళలను హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది.
ఇటీవల కర్ణాటకలోనే ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఒక మహిళ కిటికీ నుంచి బస్సు ఎక్కింది. ఇది చూసిన ఓ వృద్ధురాలు కూడా మరో మహిళ సహాయంతో కిటికీలోంచి బస్సు ఎక్కి సీట్లో కూర్చుంది. కర్ణాటక ప్రభుత్వం శక్తి యోజన కింద, మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా మహిళల బస్సు ప్రయాణం పెరగడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఘటనపై మీడియాతో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా రిజర్వేషన్ల వంటి నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. అలాగే రవాణా నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ఈ ఉచిత ప్రయాణం ఆగిపోతుందేమోనని భయపడి ఇలా ప్రయాణాలు సాగిస్తున్నారని.. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ ప్రాజెక్టును కొనసాగిస్తామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








