నీటిపై తేలియాడుతూ సాగిపోదమా.. క్యాండెలా పి8 వాయేజర్ హైడ్రోఫాయిల్ బోట్ ఆవిష్కరణ..
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అతి వినియోగం కారణంగా శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న తరుణంలో, యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో రాజ్యమేలుతుండగా, ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు గాలిలో ఎగిరే విమానాలు మరియు నీటిపై తేలియాడే బోట్లకు కూడా పాకింది. తాజాగా, ప్రపంచంలోనే మొట్టమొదటి లాంగ్ రేంజ్ హైడ్రోపాయిల్ బోట్ ఆవిష్కరించబడింది. ఆ వివరాలేంటో అదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి.

కర్భన వ్యర్థాలను తగ్గించే దిశగా ఇప్పుడు ప్రజలు మరియు తయారీదారులలో అవగాహన పెరగడంతో, ఎలక్ట్రిక్ మొబిలిటీకి డిమాండ్ జోరందుకుంది. ఇందులో భాగంగా, ఇటీవలే క్యాండెలా పి8 వాయేజర్ హైడ్రోఫాయిల్ బోట్ (Candela P-8 Voyager Hydrofoil Electric Boat) ఆవిష్కరించబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దీర్ఘ-శ్రేణి ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ బోట్. ఈ వాహనాన్ని వినియోగించే వినియోగదారులు ఎటువంటి కార్భన వ్యర్థాలను వదిలివేయకుండా లేదా శబ్ద కాలుష్యం కలిగించకుండా జలాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది.

హైడ్రోఫాయిల్ బోట్ సాధారణ బోట్ డిజైన్ లానే ఉంటుంది, కాకపోతే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటి ఉపరితలంపై కొంత ఎత్తులో తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దీని హైడ్రోఫాయిల్ వ్యవస్థ కాండెలా చే తయారు చేయబడిన ఇతర పడవ నమూనాల మాదిరిగానే ఉంటుంది. పడవలు మరియు ఓడలు సుదూర అన్వేషణకు ఎల్లప్పుడూ ప్రమాణంగా ఉంటాయి. పురాతన కాలం నుండి, అన్వేషకులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి మరియు తమ ఇష్టానుసారం ఏదైనా ఓ స్థలాన్ని అన్వేషించడానికి ఓడలను ఉపయోగించేవారు.

కాలంతో పాటే ఓడలు మరియు పడవలు వాటి రూపాన్ని మరియు సాంకేతికతను మార్చుకున్నాయి. ఇప్పుడు లక్షలాది హార్స్పవర్లను విడుదల చేసే ఇంజన్లతో కూడిన బోట్లు, పడవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనకు తెలిసిన షిప్పింగ్ మరియు బోటింగ్ సముద్రంలో అనేక మార్పులకు కారణం అవుతోంది. ఇవి విడుదల చేసే వాయి, నీటి కాలుష్యం కారణంగా అనేక సముద్ర జీవులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎలాంటి శబ్ధం చేయని మరియు పర్యావరణ సాన్నిహిత్యమైన బోట్లను తయారు చేయాలని క్యాండెలా నిర్ణయించుకుంది.

ఆ ఆలోచన నుండి పుట్టుకొచ్చినదే క్యాండెలా పి-8 వాయేజర్ హైడ్రోఫాయిల్ ఎలక్ట్రిక్ బోట్. క్యాండెలా అనేది ఎలక్ట్రిక్ బోట్ తయారీ బ్రాండ్, ఇది శిలాజ-ఇంధన రహిత సరస్సులు మరియు మహాసముద్రాలకు పరివర్తనను వేగవంతం చేసే లక్ష్యంతో ఉంది. అలా చేయడం కోసం ఈ బ్రాండ్ ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ బోట్ లను ప్రారంభించింది మరియు అవన్నీ కూడా హైడ్రోఫాయిల్లపై ప్రయాణించేవే. అయితే, ఈ బ్రాండ్ తాజాగా రూపొందించిన క్యాండెలా పి-8 వాయేజర్ హైడ్రోఫాయిల్ ఎలక్ట్రిక్ బోట్ ఓ గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.

క్యాండెలా పి-8 వాయేజర్ హైడ్రోఫాయిల్ ఎలక్ట్రిక్ బోట్ పర్యాటకం కోసం ఉపయోగించే ఒక దీర్ఘ-శ్రేణి (లాంగ్ రేంజ్) వాటర్ టాక్సీగా రూపొందించబడింది. అధిక వేగంతో 40 నాటికల్ మైళ్ల శ్రేణి అందుబాటులో ఉండటం దీని హైలైట్. ఇది 22 నాట్స్ (40.7కిమీ/గం) వేగంతో పూర్తి చార్జ్ పై 40 నాటికల్ మైళ్ల (74 కిలోమీటర్లు) దూరం ప్రయాణించగలదు. అయితే, తక్కువ వేగంతో వెళితే దాని రేంజ్ కూడా పెరుగుతుంది.

ఈ ఎలక్ట్రిక్ బోట్ ని 20 నాట్స్ (37కిమీ/గం) వేగంతో నడిపినప్పుడు ఇది దాదాపు 50 నాటికల్ మైళ్ల (92 కిలోమీటర్లు) దూరం ప్రయాణించగలదు. ఎలక్ట్రిక్ కార్లు సాధిస్తున్న రేంజ్ తో పోల్చినప్పుడు, ఈ సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే, పడవల ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నీటి వల్ల ఏర్పడే ఘర్షణ మరియు ప్రతిఘటనను అధిగమించడానికి ఓడలు మరియు పడవలకు చాలా శక్తి అవసరం.

ఈ శక్తిని అందించడానికి క్యాండెలా పి-8 వాయేజర్ లో ఉపయోగించిన హైడ్రోఫాయిల్లు కొంత వరకు సహాయపడతాయి. ఇది Candela C-POD మోటారుతో పనిచేస్తుంది మరియు ఈ మోటార్ కు నిర్వహణ అవసరం లేదని, దాని జీవితకాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బోట్లో అనేక రకాల ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇది గొప్ప రైడ్ క్వాలిటీని కలిగి ఉంటుంది మరియు మంచి సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఈ బోట్ 16 నాట్ల వేగానికి చేరుకున్నప్పుడు ఆన్బోర్డ్ ఫ్లైట్ కంట్రోలర్ ఆటోమేటిక్గా హైడ్రోఫాయిల్ కోణాన్ని మారుస్తుంది. ఇది బోట్ ను నీటి ఉపరితలంపై నుండి సుమారు 4-5 అడుగుల ఎత్తులో బోటును గాలిలోకి లేపగలదు. ఈ ఎత్తును సర్దుబాటు చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. క్యాండెలా పి-8 వాయేజర్ ఆరుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, క్యాబిన్ లోపల ప్రయాణీకుల కోసం ఎయిర్ కండిషనింగ్ను కూడా కలిగి ఉంటుంది.

క్యాండెలా పి-8 కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతం 2,000 యూరోల (రూ. 1.66 లక్షలు) అడ్వాన్స్ బుకింగ్ తో ఈ బోట్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది మరియు సముద్ర నౌకల తయారీదారులు కూడా ఇప్పుడు ఈవీ మార్గాన్ని అనుసరిస్తున్నారు. పూర్తి విద్యుత్ నౌకలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కొన్ని ఓడరేవులలో విద్యుత్ ప్రొపల్షన్ను ఉపయోగించే కొన్ని నౌకలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కేవలం విద్యుత్ శక్తితో పడవ ఎక్కువ దూరం ఎలా వెళ్లగలదో చెప్పడానికి Candela P-8 వాయేజర్ ఓ సరైన ఉదాహరణ.


Click it and Unblock the Notifications