కార్ల నుంచి నోట్ల వర్షం కురిపించిన కుర్రాళ్లు.. మరీ అంత ఓవర్ యాక్షన్ పనికి రాదన్న నెటిజన్లు!!
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చాలా మంది వింత వింత చర్యలకు పాల్పడుతుంటారు. దీని ద్వారా పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. కొందరు ఇదే ఉద్యోగంగా భావిస్తూ పూర్తి సమయం రీల్స్, వీడియోలకే కేటాయిస్తున్నారు. ఇవన్నీ ఫన్నీగా అనిపించినా.. ఒక్కోసారి వారితో పాటు ఇతరులకూ హాని కలిగిస్తున్నాయి. తాజాగా కొందరు యువకులు అలాగే పోలీసులకు చిక్కారు.
ఇటీవల కార్లు, బైక్లపై ప్రయాణిస్తూ కొందరు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీరికి పోలీసులు జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరికొందరైతే ఏకంగా సినిమాల్లో మాదిరిగా కార్లపై వెళ్తూ నోట్లు విసిరేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియోను భారత్ సమాచార్ X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. నోయిడా సెక్టార్ 37 నుంచి సిటీ సెంటర్కు ఓ ఎస్యూవీల కాన్వాయ్ వెళ్తోంది. ఈ కాన్వాయ్లో ఎస్యూవీలు, హ్యాచ్బ్యాక్లతో కలిపి 5 కార్లు ఉన్నాయి. ఆ కార్ల పై నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు.
వీడియోను చూసినట్లయితే.. పబ్లిక్ రోడ్డుపై కదులుతున్న కారులో విండోలు, సన్రూఫ్ల ద్వారా యువకులు బయటకు వేలాడుతూ నోట్లను విసురుతున్నారు. అయితే ఏ కారులో నుంచి వ్యక్తులు డబ్బులు విసురుతున్నారో కొంచెం అస్పష్టంగా ఉండగా.. 20 రూపాయల నోట్లను రోడ్డుపై విసురుతున్నట్లుగా వీడియో తీసిన వ్యక్తి పేర్కొన్నారు.

ఈ వీడియోను X లో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో ఇది నోయిడా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే కాకుండా నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా కార్లను నడుపుతున్నారు. ఇలా పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం చట్టపరంగా నేరం. తద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ట్రాఫిక్ పోలీసులకు చర్యలు తీసుకునే అధికారం ఉంది.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఆ కాన్వాయ్లోని వాహనాలను గుర్తించారు. కాన్వాయ్లో ఐదు కార్లు ఉండగా.. ఒక్కో కారు యజమానికి రూ. 33,000 చలాన్ జారీ చేశారు. కాగా ఈ ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్టంట్ సమయంలో ఉన్న ఇతర వాహనాలను కూడా గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

అనంతరం నోయిడా ట్రాఫిక్ పోలీసులు అధికారిక X ఖాతాలో నిందితుల ఫొటోలను షేర్ చేశారు. ఈ ఒక్క సంఘటనకు సంబంధించి.. పలు ట్రాఫిక్ ఉల్లంఘనల కింద వారికి మొత్తంగా రూ. 3.96 లక్షల ఫైన్తో 12 ఇ చలాన్లు జారీ చేశారు. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి చర్యలు సరికాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
రాష్ట్ర, జాతీయ రహదారులపై సీసీ కెమెరాల నిఘా, పోలీసుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కార్లలో వెళ్తూ పై కప్పుపై కూర్చుని స్టంట్స్ చేయడం, బైక్పై వెళ్తూ యువ జంటలు రొమాన్స్ చేసుకోవడం లాంటి సంఘటనలు ఇటీవల విపరీతంగా చోటుచేసుకున్నాయి. అయితే ఈ సంఘటనలన్నీ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సోషల్ మీడియా పాత్ర పెద్దదే అని చెప్పవచ్చు. నెటిజన్లు ఇందుకు తమ కళ్ల ముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లోలో షేర్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఈజీగా వారిని గుర్తిస్తున్నారు. దీంతో నిందితులకు జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








