సరయు నదిలో సరదాగా బైక్ నడిపాడు.. ఆ తర్వాత పోలీసులు అతడి 'సరదా' తీర్చేశారు!
వెర్రి వేయి విధాలు అంటారు పెద్దలు, కానీ ఈ కుర్రోడి వెర్రి మాత్రం వేయిన్నొక్కటో విధం. సాధారణంగా బైక్ ని అందరూ రోడ్డుపై నడుపుతారు, ఇతడు మాత్రం నదిలో నడిపి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పరిసర ప్రాంతాలలో పరమ పవిత్రమైన సరయు నదిలో మోటార్సైకిల్ను నడుపుతూ వెకిలి చేష్టలు చేసినందుకు గానూ ఇప్పుడు ఇతడు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. నదిలో బైక్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతడికి భారీ జరిమానా విధించారు.

ఉత్తరప్రదేశ్ (యూపి) రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో సరయు నది కూడా ఒకటి. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ఉండే సరయు నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ నది తీరిలో ప్రజలు దిగేందుకు వీలుగా మెట్లు మరియు దిగువన ఓ ప్లాట్ఫామ్ లాంటి ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలా నదిలో నడుం లోతు నీళ్లలో ఉండే ప్రదేశంపై ఈ యువకుడు అటూ ఇటూ బైక్ నడిపాడు. అది కాస్తా ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు.

ఇంటర్నెట్ లో ఇలాంటి విషయాలు వెంటనే పాపులర్ అవుతుంటాయి కాబట్టి, ఆ వీడియో కాస్తా ఆయోధ్య మరియు యూపి పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే పోలీసులు సదరు బైక్ ని మరియు బైక్ ఓనర్ ని గుర్తించి జరిమానా విధంచడం మరియు అతడికి జైలు శిక్ష విధించడం చేశారు. నదిలో ప్రమాదకరంగా బైక్ నడపడమే కాకుండా బహిరంగంగా షర్ట్ లేకుండా బైక్ నడపడం వంటి ఆరోపణలు కూడా ఆ యువకుడిపై మోపినట్లు సమాచారం.

అయోధ్య అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులు వెంటనే అప్రమత్తం అవుతున్నారు. ఈ ఘటనపై ఇంటర్నెట్ లో భారీ విమర్శలు రావడంతో అయోధ్య నగర పోలీసులు సదరు యువకుడికి ఇ-చలాన్ పంపారు. ఈ ఈ-చలాన్లో తేదీ, సదరు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను పేర్కొన్నారు. ఓ సమాచారం ప్రకారం అయోధ్య నగర పోలీసులు ఈ యువకుడికి సుమారు రూ.8,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

ప్రమాదకరమైన డ్రైవింగ్, బైక్ పై స్టంట్స్ చేయడం, హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడపడం వంటి వివిధ ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘనల క్రింద సదరు యువకుడిపై కేసులు బుక్ చేశారు. మోటారు వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 194డి, సెక్షన్ 129, మరియు సెక్షన్ 179 కింద 3 కేసులు నమోదు చేశారు.
ఈ సంఘటనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో పోలీసులు తమ పని తాము చేశామని నిరూపించేందుకు ఆ యువకుడి బైక్ పై విధించిన ఇ-చాల్ ఫొటోని మరియు బైక్ తో పాటుగా అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ ముందు నిలుచోబెట్టిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నదిలో బైక్ నడిపిన వీడియో మాదిరిగానే ఈ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. పవిత్ర నదిలో పిచ్చి పనులు చేసినందుకు అతడికి తగిన శాస్తి జిరిగందంటూ కామెంట్లు పెడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో సరదా కోసం తాము తీసుకున్న వీడియోలో తమని చిక్కుల్లో పడేస్తుంటాయి. ఈ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. సరదాగా నదిలో బైక్ నడిపుదామనుకుంటే, ఈ వీడియో వలన పోలీసులు చేతిలో అతగాడి సరదా తీరిపోయింది. ఇ-చలాన్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇప్పుడు నిందితుల నివాసాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోయింది. బైక్ నెంబర్ ఎంటర్ చేయగానే నిందితుడి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ తో సహా పూర్తి చిరునామా తెలిసిపోతుంది.
थाना को0अयोध्या पुलिस द्वारा विधिक कार्यवाही प्रचलित हैं। pic.twitter.com/fUd91pvqhn
— AYODHYA POLICE (ayodhya_police) July 5, 2022
మోటారు సైకిల్ను నదిలో పడేయడం వంటి అరుదైన నేరాలే కాకుండా, అక్రమ పార్కింగ్ మరియు ట్రాఫిక్ సిగ్నల్లను పట్టించుకోకపోవడం వంటి అనేక ట్రాఫిక్ నేరాలకు కూడా పోలీసులు ఇ-చలాన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్, స్పీడ్ లిమిటర్లు మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా భద్రతా అవసరాల కోసం దేశవ్యాప్తంగా ప్రైవేట్ సీసీ కెమెరాల వినియోగం కూడా భారీగా పెరిగింది. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ సీసీ కెమెరాలు వారిని పట్టించేందుకు ఉపయోగపడుతున్నాయి.

పోలీసులు తీసుకుంటున్న ఇలాంటి కఠిన చర్యల వల్ల భవిష్యత్తులో నేరాలు కచ్చితంగా తగ్గుతాయని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే కటకటాల వెనుక ఉన్న ఆ యువకుడి ఫోటో మరియు ఇంత భారీ జరిమానా మొత్తాన్ని చూసిన వారు ఖచ్చితంగా మరోసారి అలాంటి ఉల్లంఘనలకు పాల్పడాలని అనుకోరు. చుట్టుపక్కల పోలీసులు లేకపోయినా పట్టుబడతామనే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications








