హైదరాబాద్ డెలివరీ బాయ్ సాహసానికి గొప్ప గిఫ్ట్.. మీరూ చూడండి
కరోనా మహమ్మారి దేశాన్ని మొత్తం ప్రభావితం చేసింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ మహమ్మారి కారణంగా ఏంతోమంది జీవితాలు దుర్భరస్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ మహమ్మారి అధికంగా విస్తరించిన సమయంలో ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ నిజంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన ఒక డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేయడంలో అతను పడ్డ కష్టం మరియు అతని కష్టానికి ఫలితంగా ఒక టీవీఎస్ ఎక్స్ఎల్ 100 సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఏంటి ఈ సంఘటన, దీనికి సంబంధించి మొత్తం సమాచారం మనం ఇక్కడ చూద్దాం.

ఇక వివరాల్లోకి వెళ్తే, భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీ తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన అఖిల్ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెలెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి సంపాదన అంతంతమాత్రం ఉంది. దీంతో అకీల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుకుంటూనే జొమాటో డెలివరీబాయ్గా పనిచేస్తూ తన తండ్రికి చేదోడుగా నిలుస్తున్నాడు.

నిజానికి జొమాటో బాయ్గా పని చేయాలంటే బైక్ ఉండాల్సిందే. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు నిర్దిష్ట సమయంలో చేరుకోవాలంటే ఈ బైక్ ఉపయోగపడుతుంది. కానీ అఖిల్ వద్ద బైక్ లేదు, సైకిల్ మాత్రమే ఉంది. దీంతో జొమాటో కంపెనీ ప్రతినిధులను కలిసి తన గురించి చెప్పి, ఒప్పించి ఉద్యోగంలో చేరాడు.

ఈ క్రమంలో అఖిల్కు వారం రోజుల క్రితం ఓ ఆర్డర్ వచ్చింది. అప్పుడు సమయం రాత్రి 10 గంటల అయ్యింది. ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షం. కింగ్కోఠి నుంచి ఫుడ్ ఆర్డర్ అందుకున్న అఖిల్ లక్డీకాపుల్ నుంచి ఫుడ్ తీసుకుని డెలివరీ అడ్ర్స్ కు చేరుకున్నాడు. అయితే పార్శిల్ తీసుకోవడానికి బయటకు వచ్చిన రాబిన్ ముకేశ్ అనే కస్టమర్ వచ్చాడు. సైకిల్పై వచ్చిన డెలివరీబాయ్ను చూసి ఆశ్చర్యపోయారు.

అంత వర్షంలో అది కూడా సైకిల్ పై, అందులోనూ ఖచ్చితమైన సమయానికి రావడం అతన్ని ఒకరకమైన ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ సమయంలో అఖిల్ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే, బైక్ లేకున్నా సైకిల్పై జొమాటో బాయ్గా పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకునే అతని తాపత్రయం చూసి అతడు చలించిపోయాడు.

రాబిన్ ముకేశ్ ఎలాగైనా అఖిల్కు సాయం చేయాలనీ అనుకుని, నీకు ఎలాంటి సాయం కావాలని అడిగాడు, అప్పుడు అఖిల్ తనకు ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఉంటే కాస్త ఎక్కువ సంపాదించుకుంటానని అతనికి చెప్పాడు. ఇది విన్న వెంటనే అతడు ఇతని గురించి సమాచారాన్ని ''ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ గ్రూప్' అనే ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇందులో అతనికి బైక్ కొనివ్వాలని దానికి రూ.65800 కావాలని పేర్కొన్నారు.

ఈ విధంగా పోస్ట్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయానికే ఏకంగా రూ. 73,000 జమయ్యాయి. వెంటనే బైక్ కొన్న ముకేశ్ అఖిల్ కి గత శుక్రవారం నాడు కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ 100 బైకుతో పాటు హెల్మెట్, శానిటైజర్లు, మాస్కుల ప్యాకెట్ అందజేశాడు. మిగిలిన డబ్బును అతని కాలేజీ ఫీజు కోసం ఉపయోగించుకోమని చెప్పాడు.

ఒక పేద కుటుంబానికి ఆసరాగా నిలబడిన ఆ యువకుడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అందరి దాతలకు ముఖేష్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ముకేశ్కు అఖిల్ కుటుంబసభ్యులు కూడా కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా ఆ కస్టమర్ ఆ డెలివరీ బాయ్ కి చేసిన సాయం నిజంగా అమోఘం.
Image Courtesy: Robin Mukesh/Twitter


Click it and Unblock the Notifications








