డీజిల్ కార్ల డిమాండ్ ఎఫెక్ట్: పెట్రోల్ కార్లపై డిస్కౌంట్స్
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి, పెట్రోల్ కార్లను కొనుగోలు చేసే వారే కరువయ్యారు. రూ.70 నుండి రూ.80 వరకూ పెట్రోల్ ఇంధనంపై వెచ్చించి కేవలం 10-15 కి.మీ. మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లను మెయింటైన్ చేయడమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. వాస్తవానికి పెట్రోల్ కార్ల రన్నింగ్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ మెయింటినెస్స్ కాస్ట్, ధరలు మాత్రం తక్కువగానే ఉంటాయి.
అయినప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లకే డిమాండ్ అధికంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణంగా డీజిల్ ఇంధన ధర తక్కువగా ఉండటమే. కేవలం మైలేజ్ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు తమ అభిప్రాయాన్ని, అభిరుచిని మార్చుకొని బలవంతంగా డీజిల్ కార్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ, పెట్రోల్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇదే అనువైన సమయం. ఎందుకంటే, ఇప్పుడు డీజిల్ కార్ల అమ్మకాలు పెరిగి పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గడంతో, వీటి అమ్మకాలను పెంచుకునేందుకు కార్ మేకర్లు, డీలర్లు విభిన్న ఆఫర్లు, స్కీమ్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే, దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి పెట్రోల్ కార్లపై రూ.20,000 నుండి రూ.25,000 తగ్గింపులను అందిస్తుండగా, టొయోటా, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత మెయింటినెన్స్ వంటి ఆఫర్లను అందిస్తున్నారు. బ్రయో అమ్మకాలను పెంచుకునేందుకు హోండా ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్లను అందిస్తుంది.
అలాగే, హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు ఇయాన్పై రూ.10,000 రాయల్టీ ఎక్సేంజ్ బోనస్, శాంత్రోపై రూ.15,000 తగ్గింపులను ఆఫర్ చేస్తుండగా, కొందరు డీలర్లు గోల్డ్ కాయిన్స్, ఎల్ఈడి టెలివిజన్స్, లక్కీ డ్రాలు, ఉచిత బహుమతులుతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఒకవేళ మీరు పెట్రోల్ కారునే కొనాలని నిర్ణయించుకుంటే, ఇదే మంచి తరుణం. మీ కారును కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయం.


Click it and Unblock the Notifications









