బజాజ్కు పెద్దగా కలిసిరాని 2011-12 ఆర్థిక సంవత్సరం
ద్విచక్ర వాహనాల తయారీలో దేశపు ద్వితీయ అగ్రగామి బైక్ మేకర్గా బజాజ్ ఆటోకు గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12)లోని చివరి త్రైమాసికం పెద్దగా కలిసిరాలేదు. గత మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంగా ఏకంగా 45 శాతం మేర క్షీణించి, రూ.772 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో సమయానికి కంపెనీ నికర లాభం రూ.1,400 కోట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఇదే త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన ఆదాయం 12 శాతానికి పైగా పెరిగి రూ.4,651.4 కోట్లుగా నమోదైంది. అంత క్రితం సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో ఇది రూ.4,145 కోట్లుగా ఉంది.
కాగా.. గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12) మొత్తమ్మీద నికర లాభం కూడా తగ్గుదలనే నమోదు చేసింది. ఇదే కాలానికి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, కంపెనీ పూర్తి నికర లాభం రూ.3,455 కోట్ల నుండి రూ. 3,045 కోట్లకు పడిపోయి 12 తగ్గుదలను కనబరిచింది. అయితే, ఇదే సమయంలో మొత్తం ఆదాయం మాత్రం 19 శాతనికి పైగా పెరిగి రూ.19,595 కోట్లగా నమోదు కాగా, అంతక్రితం ఏడాదిలో ఇది రూ.16,429 కోట్లుగా నమోదైంది.
మొత్తమ్మీద 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 43,49,560 వాహనాలను విక్రయించగా, అందులో 38,34,405 యూనిట్లు మోటార్సైకిళ్లు, 5,15,155 వాణిజ్య వాహనాలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు 14 శాతం వృద్ధిని సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2012-13) మొత్తం 50 లక్షలకు పైగా వాహనాలను విక్రయించాలని బజాజ్ ఆటో లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన కొత్త పల్సర్, డిస్కవర్ బైక్ల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలమని బజాజ్ ఆటో ధీమా వ్యక్తం చేస్తుంది.


Click it and Unblock the Notifications








