ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్న బజాజ్ ఆటో
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో అందిస్తున్న ద్విచక్ర వాహనాల ధరలు త్వరలోనే ప్రియం కానున్నాయి. రూపాయి విలువ పతనం కారణంగా పెరుగుతున్న ముడి సరకుల ధరలు, ఫలితంగా పెరుగుతున్న ఉత్పాదయ వ్యయాల కారణంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని బజాజ్ మోటార్సైకిల్ బిజినెస్ విభాగం ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ తెలిపారు.
ఈ ఏడాది ఆరంభంలో కూడా అధిక ఇన్పుట్ ధరల కారణంగా బజాజ్ ఆటో ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత మోటార్సైకిల్ పరిశ్రమ అధిక భాగం స్థానిక మార్కెట్లలో లభించే విడిభాగాలనే ఉపయోగిస్తోందని, ఏవైనా దిగుమతి చేసుకునే విడిభాగాలు ఉంటే వాటి ధరలు పాక్షికంగా పెరుగుతున్నాయని తమిళనాడు మార్కెట్లో కొత్త డిస్కవర్ 125ఎస్టి మోడల్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన చెప్పారు.
అయితే, ద్విచక్ర వాహనాల ధరలను ఎంత మేర పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 125సీసీ మోటార్సైకిల్ సెగ్మెంట్లో తాము 38 శాతం వృద్ధిని సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా.. 125సీసీ బైక్ సెగ్మెంట్లో మరే కంపెనీ ఆఫర్ చేయని విధంగా మోనో-షాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్)తో డిజైన్ చేసిన సరికొత్త బజాజ్ డిస్కవర్ 125ఎస్టి మోటార్సైకిల్ను బజాజ్ ఆటో తమిళనాడు మార్కెట్లో విడుదల చేసింది. చెన్నై మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.55,740 లుగా ఉంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోడల్ను బజాజ్ ఆటో వివిధ మార్కెట్లలో దశల వారీగా కంపెనీ విడుదల చేస్తూ వస్తుంది. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లో విడుదలైన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మోడల్ ధర రూ.85,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
గడచిన మే నెల అమ్మకాల్లో బజాజ్ ఆటో 1.23 శాతం వృద్ధి నమోదు చేసుకొని 3,21,922 యూనిట్ల మోటార్సైకిళ్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరంలో ఇదే సమయానికి కంపెనీ అమ్మకాలు 3,17,989 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే, ఎగుమతులు కూడా 3 శాతం మేర వృద్ధి చెందిన 1,26,818 యూనిట్ల నుంచి 1,30,573 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








