మోటార్సైకిళ్లు, స్కూటర్ల ఉత్పత్తిని రెట్టింపు చేసిన హోండా
హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత మార్కెట్లో బాగా కలిసొచ్చినట్లుంది. ప్రస్తుతం హోండా వాహనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కంపెనీ అందిస్తున్న ఆక్టివా స్కూటర్, షైన్, యునికార్న్ వంటి మోడళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో, ఇప్పుడు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పెంపు వైపు దృష్టి సారించింది.
ఈ మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు గానూ రాజస్థాన్లో ఉన్న తపుకరా ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. హోండాకు ఇది ఇండియాలో రెండో ప్లాంటు. ఈ ప్లాంటును ప్రారంభించి ఏడు నెలలు మాత్రమే గడిచింది. ప్రస్తుతం ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని హోండా ఏటా 12 లక్షల యూనిట్లకు పెంచింది.
మానేసర్లోని హోండా తొలి ప్లాంట్, తపుకరాలోని రెండో ప్లాంట్లు కలిపి మొత్తం 28 లక్షల యూనిట్లకు చేరనుంది. అలాగే, కర్ణాటక రాజధానిలో బెంగుళూరులో కూడా ఏటా 12 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన మూడో ప్లాంటు నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ప్లాంటు నిర్వహణలోకి రానుంది.


Click it and Unblock the Notifications









