ద్విచక్ర వాహనాల ధరలను పెంచిన బజాజ్, హోండా
ఇకపై హోండా, బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పెరిగిన డీజిల్ ధరలు, ఫలితంగా పెరిగిన రవాణా ఖర్చుల నేపథ్యంలో ఉత్పత్తుల ధరలను పెంచుకున్నామని ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు హోండా తమ ఉత్పత్తుల ధరలను మోడల్ను బట్టి రూ.800 మేర పెంచగా, బజాజ్ మోడల్ను బట్టి తమ ఉత్పత్తుల ధరలను 500 మేర పెంచింది.
ఈ ధరల పెంపుపై హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వైఎస్ గులేరియా మాట్లాడుతూ.. తమ అన్ని ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ 1 నుంచి 200-800 రేంజ్లో పెంచామని, ఇటీవలి కాలంలో డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపును ప్రకటించామని అన్నారు. ఇటీవలే బీమా ఛార్జీలు కూడా పెరిగాయని, ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించామని ఆయన అన్నారు.
ఇదే కోవలో బజాజ్ ఆటో కూడా తమ అన్ని ఉత్పత్తుల ధరలను మోడల్ను బట్టి 500 వరకూ పెంచామని ప్రకటించింది. రవాణా మరియు ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలను పెంచక తప్పలేదని కంపెనీ పేర్కొంది. గడచిన మార్చ్ నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం తగ్గిన నేపథ్యంలో ఇలా ఉత్పత్తుల ధరలను పెంచడం గమనార్హం.



Click it and Unblock the Notifications








