ఆటో ఎక్స్పోలో బజాజ్ క్రూయిజర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ
బజాజ్ అవెంజర్ గుర్తుందా..? కంపెనీ అందిస్తున్న ఏకైక క్రూజర్ ఇది. స్పోర్ట్స్ బైక్స్, బడ్జెట్ బైక్స్పై దృష్టి సారించిన బజాజ్ ఆటో ఇప్పుడు క్రూయిజర్ బైక్ సెగ్మెంట్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బజాజ్ ఆటో ఓ కొత్త క్రూయిజర్ బైక్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించనుంది.
అయితే, ప్రస్తుతానికి ఈ క్రూయిజర్కు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ సంబంధం ఉన్న సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారన్ని బట్టి చూస్తే, ఈ కొత్త క్రూయిజర్ కాన్సెప్ట్ ప్రస్తుతం లభిస్తున్న అవెంజర్ కన్నా భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
బజాజ్ అవెంజర్ 220 బైక్లో కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అప్గ్రేడ్స్ చేయలేదు. ఇందులో 219.89సీసీ, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 19.03 పిఎస్ల శక్తిని, 17.5 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ పల్సర్ 220 బైక్లో కూడా ఉపయోగించారు.

గడచిన కొద్ది కాలంగా గమనిస్తే, బజాజ్ ఆటో కేవలం పల్సర్, డిస్కవర్ మోడళ్లపై మాత్రమే దృష్టి సారించి, అవెంజర్ను పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటవలే పల్సర్లో కొత్త మోడల్ను (200ఎస్ఎస్) ప్రవేశపెట్టింది. అలాగే డిస్కవర్ బ్రాండ్లు వివిధ ఇంజన్ సామర్థ్యాలు, ఫీచర్లతో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. మరోవైపు పెర్ఫామెన్స్ వెర్షన్ పల్సర్ (375సీసీ వేరియంట్)ను విడుదల చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
ప్రస్తుతం భారత్లో ప్రీమియం బైక్లకు గిరాకీ బాగా పెరుగుతున్న నేపథ్యంలో, బజాజ్ ఆటో ఇకపై అవెంజర్ బ్రాండ్ను అప్గ్రేడ్ చేయటం లేదా క్రూయిజర్ సెగ్మెంట్లో ఓ కొత్త పవర్ఫుల్ బైక్ను ప్రవేశపెట్టం వంటి అంశాల్లో ఏదో ఒకటి జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే, వచ్చే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








