హీరో ప్లాంట్లో సమ్మె సెగలు; జీతాల పెంపుపై నిరసన
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్లోను సమ్మె సెగలు తగులుతున్నాయి. అయితే, మాసేసర్లోని మారుతి సుజుకి ప్లాంటులో వర్కర్ల మాదిరి హింసాయుతంగా కాకుండా శాంతియుతంగా హీరో మోటో గుర్గావ్ ప్లాంట్ కార్మికులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. హీరో మోటోకు గుర్గావ్లో ఉన్న ఫ్యాక్టరీలోని కార్మికులు జీతాలను పెంచాలను కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, యాజమాన్యం ఇచ్చే కాఫీ, టీలతో పాటుగా స్నాక్స్ను నిరాకరిస్తున్నారు.
ఢిల్లీకి సమీపంలోని ఎన్సిఆర్లో ప్రాంతంలో నివసిస్తున్న కార్మికుల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో, తమ జీతాలను కూడా పెంచాలని హీరో మోటో కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎమ్సిడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో 1200 మంది పర్మినెంట్ వర్కర్లు తమకు రూ.18,000 జీతం పెంచాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. జీతాల పెంపు గురించి కార్మికులు గడచిన ఆగస్టు 2012 నుంచి యాజమాన్యంతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీ చెల్లిస్తున్న వేతనాలు చాలటం లేదని, కంపెనీ వెంటనే తమ జీతాలను నెలకు రూ.15,000 నుంచి రూ.18,000 రేంజ్లో పెంచాలని వారు కోరుతున్నారు. కాగా.. ఈ విషయానికి సంబంధించి తాము సమ్మెకు దిగబోమని అలాగే ఉత్పత్తికి కూడా అంతరాయం కలిగించబోమని కార్మికులు చెబుతున్నారు. జీతాల పెంపుకు సంబంధించి కంపెనీకు నోటీసు ఇచ్చామని, అయితే కంపెనీ మాత్రం కేవలం రూ.6,500 పెంచేందుకే అంగీకరించిందని హెచ్ఎమ్సిడబ్ల్యూయూ అధ్యక్షుడు కవల్ప్రీత్ సింగ్ చెప్పారు.



Click it and Unblock the Notifications








