అగ్రస్థానంపై కన్నేసిన హోండా, మరిన్ని కొత్త ఉత్పత్తుల విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానంపై కన్నేస్తోంది. హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి విడిపోయిన తర్వాత, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ), దేశీయ విపణిలో మరిన్ని సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో భారీ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 43 శాతం వృద్ధితో 39.3 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎమ్ఎస్ఐ తెలిపింది.
హెచ్ఎమ్ఎస్ఐ గడచిన ఆర్థిక సంవత్సరంలో 27.54 లక్షల యూనిట్లు విక్రయించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో నర్సాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ప్లాంటును ప్రారంభిస్తామని, ఈ ప్లాంటు ప్రారంభంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే అమ్మకాలను 43 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో కెయిటా మటాసూ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కంపెనీ తమ డీలర్షిప్ నెట్వర్క్ను కూడా విస్తరించనుంది. ఇందులో భాగంగా, కొత్తగా 500 ఔట్లెట్లతో పాటుగా 2,500 సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రానున్న మరింత అధిక మైలేజీనిచ్చే వాహనాలను ప్రవేశపెడతామని మటాసూ చెప్పారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు 31 శాతం వృద్ధిని సాధించి 27.54 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 21.07 లక్షల యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.
కర్ణాటకలో ఏర్పాటు చేయనున్న మూడవ హోండా టూవీలర్ ప్లాంటు కోసం సుమారు రూ.1,000 కోట్ల పెట్టబడులను వెచ్చించనున్నామని, ఈ ప్లాంటును సాలీనా 12 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ ప్లాంటు పూర్తిస్థాయిలో నిర్వహణకు వస్తే, అన్ని హోండా ప్లాంట్లలో కలిపి కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 40 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హోండాకు హర్యానా, రాజస్థాన్లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి.


Click it and Unblock the Notifications








