సెంచురో సక్సెస్తో భారీ వృద్ధిని కనబరిచిన మహీంద్రా టూవీలర్స్
యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ మోటార్సైకిల్ మహీంద్రా సెంచురో, విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. స్టాలియో విషయంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్న మహీంద్రా టూవీలర్స్, తాజాగా ప్రవేశపెట్టిన కొత్త బైక్లతో మంచి మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది.
అక్టోబర్ 2012తో పోల్చుకుంటే అక్టోబర్ 2013 నెలలో మహీంద్రా టూవీలర్స్ అమ్మకాలు ఏకంగా 157 శాతం వృద్ధి చెందాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 29,696 యూనిట్లను విక్రయించగా, 1092 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇందులో ఎక్కువ భాగం అమ్మకాలు మహీంద్రా సెంచురో నుంచి వచ్చినవే. ఇదే సమయంలో మరో బైక్ పాంటెరో, ఇతర స్కూటర్ అమ్మకాలు కూడా సజావుగానే సాగుతున్నాయి.

మోటార్సైకిల్ సెగ్మెంట్లో మహీంద్రా టూవీరల్స్ ఊహించని రీతిలో విజయం సాధించడంతో, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పో మహీంద్రా టూవీరల్స్ తమ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే ఆస్కారం ఉంది.
మహీంద్రా సెంచురో విషయానికి వస్తే, ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8.5 పిఎస్ల శక్తిని, 8.5 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








