నాలుగు రాష్ట్రాల్లో మహీంద్రా పాంటెరో బైక్ విడుదల
మహీంద్రా అండ్ మహీంద్రాకు (ఎమ్ అండ్ ఎమ్) చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న 110సీసీ మోటార్సైకిల్ 'మహీంద్రా పాంటెరో' (Mahindra Pantero) ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో లభ్యం కానుంది. విడతల వారీగా ఈ బైక్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రారంభంలో భాగంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర మార్కెట్లలో విడుదల చేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా లభ్యం కానుంది.
కాగా.. మహీంద్రా టూవీలర్స్ ఇటీవలే తమ పాంటెరో బైక్లో మూడు కొత్త వేరియంట్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మహీంద్రా పాంటెరో ఇప్పుడు టి-1, టి-2, టి-3, టి-4 అనే నాలుగు వేరియంట్లలో, విభిన్న ఫీచర్లతో, వివిధ ధరలలో లభ్యమవుతుంది. గతంలో మహీంద్రా టూవీలర్స్ విడుదల చేసిన 110సీసీ మోటార్సైకిల్ స్టాలియోకు రీస్టయిల్డ్ వెర్షనే పాంటెరో. అయితే, ఇందులో పూనేకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్ అండ్ డి కేంద్రం అభివృద్ధి చేసిన అధునాత 110సీసీ ఇంజన్ను ఉపయోగించారు.

ఇందులో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ గరిష్టంగా 8.5 పిఎస్ల శక్తిని, వద్ద 8.5 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను ఈ బైక్లో గమనించవచ్చు.
మహీంద్రా పాంటెరో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
మహీంద్రా పాంటెరో టి-1: రూ.48,990
మహీంద్రా పాంటెరో టి-2: రూ.47,990
మహీంద్రా పాంటెరో టి-3: రూ.45,690
మహీంద్రా పాంటెరో టి-4: రూ.44,690
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)


Click it and Unblock the Notifications








