లీటరు పెట్రోల్పై 70 పైసలు, డీజిల్పై 50 పైసలు పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గడచిన జులై 14న లీటరు పెట్రోలుపై రూ.1.55 పైసలు చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ధరను పెంచిన చమురు కంపెనీలు తాజాగా మరోసారి పెట్రోల్ ధరను పెంచాయి. ఈసారి లీటరుకు 70 పైసలు (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచుతున్నట్లు ప్రకటించాయి. కేవలం పెట్రోల్ ధరనే కాకుండా డీజిల్ ధరను కూడా పెంచేశారు.
లీటరు డీజిల్పై 50 పైసల (స్థానిక పన్నులు కలుపుకోకుండా) చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీ పేర్కొన్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం (31.07.2013) అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. గడచిన రెండు నెలల్లో ఇలా పెట్రోల్ ధరలు పెరగటం ఇది 5వ సారి. కాగా.. జనవరి 17 నుంచి డీజిల్ ధరలు పెరగటం ఇది 7వ సారి.
మొత్తమ్మీద చూసుకుంటే జూన్ నుంచి పెట్రోల్ ధరలు లీటరుకు రూ.6.82 పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.75 పెరిగింది. డాలరుతో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 117 డాలర్లు బ్యారల్ నుంచి రూ.120.50 డాలర్లకు పెరగింది. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పలేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది.

తాజాగా డీజిల్ ధరలు సవరించిన తర్వాత కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.29 చొప్పున నష్టపోతున్నాయని తెలిపింది. తాజా పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.71.28 (పెట్రోల్); రూ.51.40 (డీజిల్)
* ముంబై - రూ.78.61 (పెట్రోల్); రూ.58.23 (డీజిల్)
* కలకత్తా- రూ.78.64 (పెట్రోల్); రూ.55.74 (డీజిల్)
* చెన్నై - రూ.74.49 (పెట్రోల్); రూ.54.76 (డీజిల్)


Click it and Unblock the Notifications








