మరోసారి చర్చలు విఫలం, బజాజ్లో కొనసాగుతున్న సమ్మె
గడచిన 18 రోజులుగా పూనేలోని బజాజ్ ఆటోకు చెందిన ఛాకన్ ప్లాంట్లో సమ్మె కొనసాగుతునే ఉంది. సమ్మెను విరమింపజేసేందుకు కార్మికులతో యాజమాన్యం జరిపిన చర్చలు రెండోసారి కూడా విఫలమయ్యాయి. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శరద్ పవార్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి హసన్ ముషరఫ్ల మధ్య ఓ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.
గడచిన శుక్రవారం నాడు యజమాన్యానికి, కార్మిక యూనియన్కు మధ్య చర్చలు జరిగాయి. కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని సుమారు నాలుగు గంటల నిర్వహించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సమావేశం జరిగింది. అంతకు ముందు బుధవారం నాడు ఇలాంటి సమావేశమే జరిగింది. అందులోను కూడా ఎలాంటి సానుకూల ఫలితాలు వెల్లడి కాలేదు.

ఈ ప్లాంటులో 925 మంది శాస్వత కార్మికులు పనిచేస్తుండగా, 1000 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ట్రైనీ వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ 1000 మంది వర్కర్లు కూడా తమ పర్మినెంట్ చేయాలని, జీతాలను సవరించాలని, వర్కర్లకు కంపెనీ షేర్లలో వాటాలు ఇవ్వాలని కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది. 25 శాతం వేతనాలను పెంచడంతో పాటు తాత్కాలిక, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతుంది.
అంతేకాకుండా, సస్పెండ్ చేసిన కొంత మంది ఉద్యోగులను మరియు ఛాకన్ ప్లాంటు నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి ఇదే ప్లాంటుకు పిలిపించాలని కూడా సదరు యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఛాకన్ ప్లాంటులో ఏటా 12 లక్షల మోటార్సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో పల్సర్, అవెంజర్, నిన్జా, కెటిమ్ బ్రాండ్ మోటార్సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








