మే 15కు వాయిదా పడిన బజాజ్ ఛాకన్ ప్లాంట్ వర్కర్ల సమ్మె
బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో నేటి నుంచి జరగాల్సిన కార్మికుల సమ్మె వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ ఫండ్స్ (సిఎస్ఆర్ నిధుల)ను కంపెనీ యాజమాన్యం వర్కర్ల కోసం వినియోగించడం లేదని 'విశ్వ కళ్యాణ్ కామ్గర్ సంఘటన (వికెకెఎస్)' వర్కర్స్ యూనియన్ గడచి రెండు వారాల క్రితం కంపెనీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసినదే.
అయితే, ఈ యూనియన్ సమ్మెను మరో రెండు వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. యాజమాన్యానికి మరి కొంత గడువు ఇవ్వాలనే ఉద్దేశంతో సమ్మెను వాయిదా వేసినట్లు యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఛాకన్ ప్లాంట్ సమీపంలో యూనియన్ నాయకులు నాలుగు గంటలపాటు సమావేశమై పెద్ద ఎత్తున చర్చించిన తర్వాత తమ డిమాండ్లను పరిశీలించేందుకు యాజమాన్యానికి మరింత గడువు ఇవ్వాలని నిర్ణయించినట్లు బజాజ్ ఆటో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు దిలీప్ పవార్ తెలిపారు.

అలాగే, ఉద్యోగుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని యాజమాన్యానికి మరికొంత గడువు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. యూనియన్ తమ డిమాండ్ల జాబితాను యాజమాన్యానికి ఏప్రిల్ 14వ తేదీన నోటీసు రూపంలో ఇచ్చింది. ఆ నోటీసులో సీఎస్ఆర్ నిధులను ఉద్యోగుల పిల్లలకు చదువుకు వినియోగించాలని, కంపెనీ వ్యవఎ్థాపకుడు జమన్లాల్ బజాజ్ పేరుతో ఒక మ్యూజియం నిర్మించాలని, కంపెనీ ఉద్యోగులకు డిస్కౌంట్ ధరలకు షేర్లను కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు,
అయితే, యూనియన్ డిమాండ్లకు మాత్రం యాజమాన్యం ఏ మాత్రం అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికులు ఏప్రిల్ 28వ తేది నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ఈ సమ్మెను మే 15వ తేదికి వాయిదా వేశారు. బజాజ్ ఛాకన్ ప్లాంట్లో 2000 మందికార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 900 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్ సామర్థ్యాం 1.2 మిలియన్ యూనిట్లు. ఈ ప్లాంట్లో పల్సర్, అవెంజెర్, నిన్జా, కెటిఎమ్ ఉత్పత్తుల తయారవుతున్నాయి.


Click it and Unblock the Notifications








