జనవరి నుంచి పెరగనున్న బజాజ్ డిస్కవర్, ప్లాటినా ధరలు
బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న బడ్జెట్ బ్రాండ్ మోటార్సైకిళ్లు డిస్కవర్, ప్లాటినా ధరలను వచ్చే జనవరి నుంచి పెంచాలని చూస్తోంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు గానూ ఈ మోడళ్ల ధరలను వచ్చే నెలలో పెంచాలని యోచిస్తున్నామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్సైకిల్స్ డివిజన్) ఎరిక్ వ్యాస్ తెలిపారు.
ఈ ఏడాది పండుగ సీజన్ ముగిసిన తర్వాత బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ మోటార్సైకిళ్ల ధరలను రూ.1,000 మేర పెంచిన సంగతి తెలిసినదే. కార్మికుల వేతనాలు, విద్యుత్ చార్జీలు, తదితర ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని, ఈ భారాన్ని తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వ్యాస్ వివరించారు.

ఇప్పటి వరకూ డిస్కవర్, ప్లాటినా మోడళ్ల ధరలను పెంచలేదని, జనవరి 2015లో వీటి ధరలు పెంచుతామని ఆయన చెప్పారు. అయితే, వీటి ధరలను ఎంత మేర పెంచనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ బైక్ల అమ్మకాల పనితీరు, ఎక్సైజ్ సుంకం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ధరల పెంపును నిర్ణయించనున్నారు.
గడచిన నవంబర్ నెలలో బజాజ్ ఆటో మోటార్సైకిళ్ల అమ్మకాలు 6 శాతం తగ్గి, 2,61,948 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో కూడా అమ్మకాలు ఇదే స్థాయిలో ఉంటాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బజాజ్ ఆటో దేశీయ విపణిలో ప్లాటినా, డిస్కవర్, పల్సర్, అవెంజర్ వంటి స్వంత మోడళ్లతో పాటుగా కవాసకి, కెటిమ్ వంటి మోటార్సైకిళ్లను కూడా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








