బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో మరోసారి సమ్మె సైరెన్!
బజాజ్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మ్రోగనుంది. కంపెనీ యొక్క ఛాకన్ ప్లాంట్లో ఏప్రిల్ 28వ తేది నుంచి సమ్మె నిర్వహిస్తామని 'విశ్వ కళ్యాణ్ కామ్గర్ సంఘటన (వికెకెఎస్)' వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ ఫండ్స్ (సిఎస్ఆర్ నిధుల)ను కంపెనీ యాజమాన్యం వర్కర్ల కోసం వినియోగించడం లేదని ఈ యూనియన్ ఆరోపించింది.
కంపెనీ సిఎస్ఆర్ నిధులను ఉద్యోగుల పిల్లల చదువుకు వినియోగించాలని, కంపెనీ వ్యవస్థాపకుడి స్మారకార్థం ఒక మ్యూజియం నిర్మించడానికి సీఎస్ఆర్ నిదులను వెచ్చించాలని వికెకెఎస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లు న్యాయమైనవేనని ఆ యూనియన్ తమని తాము సమర్థించుకుంది.

ఈ విషయంలో బజాజ్ ఆటో యాజమాన్యం పక్షపాతంగా, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాత్రం మరోసారి కార్మికులు సమ్మెకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లలో న్యాయం లేదని ఆయన ఆక్షేపిస్తున్నారు.
రాజీవ్ బజాజ్ వ్యాఖ్యలను బట్టి యాజమాన్యం మొండి వైఖరి తేటతెల్లం అవుతోందని యూనియన్ అధ్యక్షుడు దిలీప్ పవార్ వ్యాఖ్యానించారు. బజాజ్ యాజమాన్యం చరిత్రచూస్తే పారిశ్రామిక సంబంధాలు పాటించడంలో ఘోరంగా విఫలం అవుతోందని ఆయన విమర్శించారు.


Click it and Unblock the Notifications








