చిన్న పట్టణాలపై దృష్టి సారించిన హ్యార్లీ డేవిడ్సన్
అమెరికాకు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హ్యార్లీ డేవిడ్సన్, భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటికే దేశీయ విపణిలో స్థిరమైన లగ్జరీ టూవీలర్ బ్రాండ్గా నిలిచిన హ్యార్లీ డేవిడ్సన్, ఇక్కడి మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు చిన్న పట్టణాలపై దృష్టిపెట్టింది.
భారత మార్కెట్లో మరింత వృద్ధిని సాధించేందుకు టైర్-2 పట్టణాల్లో డీలర్షిప్ నెట్వర్క్ను విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. 'ఢిల్లీ, ముంబైలలో తాము ఇటీవలే రెండవ డీలర్షిప్ కేంద్రాలను ప్రారంభించామని, మరికొద్ది రోజుల్లో బెంగుళూరులో మరొక డీలర్ను మరియు గుజరాత్లోని సూరత్లో రెండవ డీలర్షిప్ను ఏర్పాటు చేయనున్నామని' హ్యార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ తెలిపారు.

కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు కొత్త మరియు చిన్న పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నామని, తమ కస్టమర్లు ఎక్కడైతే రైడ్ చేస్తూ, జీవిస్తుంటారో అక్కడికే తాము వెళ్తుంటామని, ఉదాహరణకు సూరత్లో ఇప్పటికే 50 మంది హ్యార్లీ ఓనర్లు ఉన్నారని, ఇప్పటికే హ్యార్లీ ఓనర్లు ఉన్న లుథియానా, గౌహతి వంటి ప్రాంతాల్లోకి కూడా 2015లో ప్రవేశిస్తామని ఆయన చెప్పారు.
హ్యార్లీ డేవిడ్సన్ 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 6,000 యూనిట్లకు పైగా మోటార్సైకిళ్లను కంపెనీ విక్రయించింది. కంపెనీ ఇటీవలే బ్రేకవుట్, స్ట్రీట్ గ్లైడ్, సివిఓ లిమిటెడ్ ఎడిషన్ అనే మూడు కొత్త మోటార్సైకిళ్లను కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








