కర్ణాటకలో రైడర్, పిలియన్ రైడర్కి హెల్మెట్ తప్పనిసరి
కర్ణాటక రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలను నడిపే మోటారిస్టులే కాకుండా, వెనుక సీటులో కూర్చునే పిలియన్ రైడర్లు కూడా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే దిశగా కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా.. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నగరాలకే పరిమితమైన హెల్మెట్ ధారణ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన 'వాహన సురక్షతా నియమావళి'ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర రవాణా శాఖ వాహన చాలకుల భద్రత విషయంలో మరింత కఠిన నియమావళిని రూపొందించే పనిలో పడింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు మైసూరు, మంగళూరు, బెళగావి, హుబ్లీ, ధార్వాడ, దావణగిరి నగరాల్లో మాత్రమే ప్రస్తుతం హెల్మెట్ రూల్ తప్పనిసరిగా ఉంది. అయితే, ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు గాను ఈ నిబంధనను రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సైతం అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ యోచిస్తోంది.

అంతా సజావుగా జరిగితే వచ్చే జనవరి 2015 ఆరంభం నుంచే రాష్ట్ర మంతటా, ద్విచక్ర వాహనాలను నడిపే మోటారిస్టులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. కేవలం ద్విచక్ర వాహనాన్ని నడిపేవారే కాకుండా, వెనక సీటుపై కూర్చునే పిలియన్ రైడర్ కూడా తప్పని సరిగా హెల్మెట్ను ధరించాలనే కొత్త నియమావళిని కూడా రాష్ట్ర రవాణాశాఖ అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఈ కొత్త రూల్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లయితే, ఆయా ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా సంచరించే వాహన చాలకులపై రూ.500 జరిమానా విధించడంతో పాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ని సైతం రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి, కేవలం జరిమానా నుంచి తప్పించుకోవటం కాకుండా మీకోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.


Click it and Unblock the Notifications








