ఢిల్లీలో మహిళా పిలియన్ రైడర్లకు హెల్మెట్ తప్పనిసరి, సిక్కు మహిళలకు మినహాయింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలను నడిపే మహిళా రైడర్లు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఎవ్వరూ అడిగేవారు లేరు. కానీ, ఇకనుంచి ఆ పరిస్థితి మారనుంది, ఎందుకంటే ఇకపై మహిళా రైడర్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపే మహిళే కాకుండా, వెనుక సీటులో కూర్చునే మహిళ (పిలియన్ రైడర్) కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా మారింది.
ఈమేరకు, ఢిల్లీ సర్కారు కొత్త ఆదేశాలను జారీ చేసింది. అయితే, సిక్కు మహిళలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది. మతపరమైన కారణాలను పరిగణలోకి తీసుకొని, సిక్కు మహిళలు మాత్రం టూవీలర్ రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇదివరకటి నిబంధన ప్రకారం టూవీలర్పై వెనుక సీటులో కూర్చునే పిలియన్ రైడర్కు హెల్మెట్ రూల్ ఆప్షనల్గా ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం, టూవీలర్ నడిపే వారే కాకుండా, వెనుక సీటుపై కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.

ఢిల్లీ రోడ్లపై హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలకు గురై మరిణించే/గాయపడే మహిళా రైడర్ల సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతున్న కారణంగా, ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మోటార్ వాహన చట్టం 1993లోని రూల్ 115ను సవరించాలని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెరపైకి తీసుకువచ్చిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది.


Click it and Unblock the Notifications








