స్వల్పంగా పెరిగిన హీరో సేల్స్, త్వరలో 4 కొత్త మోడళ్ల విడుదల!
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను మరింత పెంచుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది నెలల్లో కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. గడచిన ఫిబ్రవరి నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.
గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొత్తం 5,01,271 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొత్తం 5,04,181 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించామని కంపెనీ పేర్కొంది. తమ జపాన్ భాగస్వామి హోండా నుంచి విడిపోయినప్పటికీ ప్రతి నెలా ఐదు లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాగిస్తున్నామని హీరో మోటోకార్ప్ తెలిపింది.

గడచిన నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ద్విచక్ర వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకి బదిలీ చేస్తామని హీరో మోటోకార్ప్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు. ఉత్పత్తుల ధరలు తగ్గితే ఆటోమొబైల్ రంగం తిరిగి పుంజుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు కొత్తగా మరో నాలుగు మోడళ్లను (ప్లెజర్, ఎక్స్ట్రీమ్, కరిజ్మా, జడ్ఎమ్ఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను) ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ నాలుగు కొత్త వేరియంట్లను మార్చ్ నెలాఖరు నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








