హీరో రాజస్థాన్ ప్లాంట్ షురూ; మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రపంచ మార్కెట్లకు తన సత్తా ఏంటో చూపించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచ దేశాల్లో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసి, అక్కడి మార్కెట్లతో తన పరిధిని పెంచుకునేందుకు హీరో మోటోకార్ప్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడులను వెచ్చించనుంది.
మనదేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణలో భాగంగా కొలంబియా మరియు బంగ్లాదేశ్లలో కూడా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు. వీటితో పాటుగా రాజస్థాన్లోని కుకాస్లో ఓ అంతర్జాతీయ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్ అండ్ డి) కూడా నెలకొల్పనున్నట్లు ఆయన వివరించారు.

కొలంబియాలో ఇటీవలే హీరో మోటోకార్ప్ తమ ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసి, ప్లాంట్ పనులను ప్రారంభించింది. కాగా.. బంగ్లాదేశ్లో త్వరలోనే ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ముంజాల్ తెలిపారు. హీరో మోటో 2020 నాటికి తమ మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా ఈ పెట్టుబడి ప్రణాళికలను అమలుచేస్తున్నామని ఆయన చెప్పారు.
హీరో మోటోకార్ప్ భారతదేశంలో తమ నాల్గవ ప్లాంట్ను మంగళవారం నాడు రాజస్థాన్లో ప్రారంభించింది. ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ఈ ప్లాంట్ చేరికతో కంపెనీ మొత్తం సామర్థ్యం సాలీనా 7.65 మిలియన్ యూనిట్ల చేరుకోనుంది. రాజస్థాన్ ప్లాంట్ కోసం హీరో మోటోకార్ప్ రూ.1,000 కోట్ల పెట్టుబడిని వెచ్చించనట్లు పేర్కొంది. కాగా.. గుజరాత్లోని హాలోల్లో నిర్మించనున్న తమ ఐదవ ప్లాంట్ పనులను నవంబర్ నెలలో ప్రారంభిస్తామని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆరవ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ముంజాల్ వివరించారు.


Click it and Unblock the Notifications








