ప్యూజో స్కూటర్లో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న మహీంద్రా
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, ఫ్రాన్స్కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ పిఎస్ఏ ప్యూజో సిట్రాన్కు సంబంధించిన స్కూటర్ యూనిట్ను దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసినదే.
కాగా.. ఇప్పుడు ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెడుతూ.. ప్యూజో మోటార్సైకిల్స్ (పిఎస్ఏ గ్రూప్ కంపెనీలో ఓ భాగం)లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంటున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. మహీంద్రా-ప్యూజోల భాగస్వామ్యంతో ఇరు కంపెనీలు ద్విచక్ర వాహన వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తాయని, ప్యూజోకు ఇండియన్ మార్కెట్లోకి యాక్సెస్ కల్పించేందుకు, మాస్ మార్కెట్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మార్కెటింగ్లో పోటీతత్వం కల్పించేందుకు మహీంద్రా సహకరిస్తుందని అలాగే మహీంద్రా గ్లోబల్ మార్కెట్లలో యాక్సెస్ కల్పించేందుకు, ప్రీమియం రేంజ్ మోటార్సైకిళ్లను ఆఫర్ చేసేందుకు, యూరోపియన్ మార్కెట్లో మంచి పట్టు సాధించేందుకు ప్యూజో కృషి చేస్తుందని అన్నారు.
ప్యూజోతో భాగస్వామ్యం వలన భారత టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వంటి సంస్థలకు గట్టి పోటీని ఇవ్వొచ్చని మహీంద్రా అంచనా వేస్తోంది. యూరప్లో కెల్లా రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. కానీ, ఈ సంస్థకు చెందిన స్కూటర్ వ్యాపారం మాత్రం గడచిన దశాబ్ద కాలంగా నష్టాల్లో సాగుతోంది. గడచిన సంవత్సరంలో ప్యూజో కేవలం 79,000 ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది.


Click it and Unblock the Notifications








