ప్యూజో స్కూటర్లు ఇండియాకి రావట్లేదు; ప్రస్తుతానికి ఫ్రాన్స్లోనే..
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, ఫ్రాన్స్కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ పిఎస్ఏ ప్యూజో సిట్రాన్కు సంబంధించిన ప్యూజో మోటార్సైకిల్స్ (పిఎస్ఏ గ్రూప్ కంపెనీలో ఓ భాగం)లో 51 శాతం వాటాను కైవసం చేసుకున్న సంగతి తెలిసినదే.
ఈ డీల్ తర్వాత.. మహంద్రా టూవీలర్స్ తమ భాగస్వామ్య ప్యూజో స్కూటర్లను ఇండియాకు తీసుకువస్తుందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే, కంపెనీ మాత్రం వీటిని ఖండిస్తోంది. ప్రస్తుతానికి ప్యూజో స్కూటర్లను ఫ్రాన్స్లోనే విక్రయిస్తామని, ఇప్పట్లో వీటిని ఇండియాకు తీసుకువచ్చే ప్లాన్స్ లేవని మహీంద్రా స్పష్టం చేసింది.

ప్యూజో మోటార్సైకిల్స్లో మహీంద్రాకు మెజారిటీ వాటా ఉన్న నేపథ్యంలో, మహీంద్రా ఈ సంస్థను ఫ్రాన్స్ నుంచి ఇండియాకు తరలించేయవచ్చని, ఇలా జరిగితే ఫ్రాన్స్లో తమ ఉద్యోగాలు పోతాయని అక్కడి స్థానికులు కంగారుపడుతున్న నేపథ్యంలో, మహీంద్రా యాజమాన్యం ఈ విషయంలో వారికి స్పష్టతను ఇచ్చింది. మరో రెండేళ్ల పాటు కంపెనీ నుంచి ఎవ్వరినీ తొలగించబోమని హామీ ఇచ్చింది.
మహీంద్రా తమ ముగ్గురు డైరక్టర్లను ప్యూజో బోర్డు కోసం నామినేట్ చేసింది, ఈ విషయంపై ఇంకా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు.

వాస్తవానికి ఈ డీల్ కుదిరిన సమయంలో.. ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. మహీంద్రా-ప్యూజోల భాగస్వామ్యంతో ఇరు కంపెనీలు ద్విచక్ర వాహన వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తాయని, ప్యూజోకు ఇండియన్ మార్కెట్లోకి యాక్సెస్ కల్పించేందుకు, మాస్ మార్కెట్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మార్కెటింగ్లో పోటీతత్వం కల్పించేందుకు మహీంద్రా సహకరిస్తుందని అలాగే మహీంద్రా గ్లోబల్ మార్కెట్లలో యాక్సెస్ కల్పించేందుకు, ప్రీమియం రేంజ్ మోటార్సైకిళ్లను ఆఫర్ చేసేందుకు, యూరోపియన్ మార్కెట్లో మంచి పట్టు సాధించేందుకు ప్యూజో కృషి చేస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications








