న్యూ ఇయర్ గిఫ్ట్: తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
మోటారిస్టులకు గుడ్ న్యూస్. నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. గడచిన కొద్ది నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపధ్యంలో, భారత్లో కూడా వీటి ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ముడి చమురు ధర అంతరాష్ట్రీయంగా ప్రతీ బ్యారెల్కు మూడు డాలర్ల చొప్పున తగ్గిందని, ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన ఒక ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
చమురు కంపెనీలు నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున సమావేశమై చమురు ధరల తీరును సమీక్షించి, వాటి ధరల పెంపు లేదా తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటాయి. ఇందులో భాగంగానే, నేడు సమావేశం కానున్న చమురు కంపెనీలు ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఒకవేళ ధరలు తగ్గితే, అవి నేటి అర్థరాత్రి (డిసెంబర్ 31) నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న అనంతరం ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి వరకూ తగ్గే అవకాశం ఉంటుంది.
చమురు కంపెనీలు ధరల తగ్గింపుపై నిర్ణయం ప్రకటించినట్లయితే, ఇప్పటి వరకూ గడచిన ఐదు నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం 10వసారి కాగా, డీజిల్ ధర తగ్గడం 6వసారి కానుంది. ఈనెల 15వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








