లీటరుకు 70 పైసలు తగ్గిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవటంతో ముడి చమురు దిగుమతి ధరలు తగ్గి, తద్వారా దేశీయ విపణిలో అమ్ముడు కానున్న పెట్రోల్ ధర కూడా తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.
పెట్రోల్ ధరను లీటరుకు 70 పైసల చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) తగ్గిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. స్థానిక పన్నులు కలుపుకుంటే ఈ ధర లీటరుకు 1 రూపాయి వరకు తగ్గుతుంది. తగ్గిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈనెల ఆరంభంలో (ఏప్రిల్ 1న) పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసినదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను మూడుసార్లు సవరించారు. తాజాగా చేసిన సవరణ నాల్గవది. కాగా.. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.
కేంద్రంపై పెట్రోల ధరలపై నియంత్రణలు పూర్తిగా ఎత్తివేసినప్పటి నుంచి వాటి నియంత్రణ చమురు కంపెనీల హస్తగతమైన సంగతి తెలిసినదే. కాగా.. డీజెల్ ధరలపై కూడా ప్రభుత్వం త్వరలోనే నియంత్రణలను ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశలో భాగంగానే, ప్రతినెలా డీజిల్ ధరను పెంచడం జరుగుతోంది.


Click it and Unblock the Notifications








