పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించనున్న చమురు కంపెనీలు!
ఈనెల ఆరంభంలో (ఏప్రిల్ 1న) స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవటంతో ముడి చమురు దిగుమతి ధరలు తగ్గి, తద్వారా దేశీయ విపణిలో అమ్ముడు కానున్న పెట్రోల్ ధర కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 1, 2014వ తేదీన డాలరు మారకంతో పోల్చుకుంటే, రూపాయి మారకపు విలువ తగ్గడంతో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు 75 పైసల చొప్పున (స్థానిక పన్నులు లేదా వ్యాట్ కలుపుకోకుండా) తగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, ఈసారి కూడా ఇదే విధంగా చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుకు ఒక్క రూపాయి వరకు తగ్గించవచ్చని చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారి ఒకరు వెల్లడించారు. కాగా.. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను మూడుసార్లు సవరించారు. కేంద్రంపై పెట్రోల ధరలపై నియంత్రణలు పూర్తిగా ఎత్తివేసినప్పటి నుంచి వాటి నియంత్రణ చమురు కంపెనీల హస్తగతమైన సంగతి తెలిసినదే. కాగా.. డీజెల్ ధరలపై కూడా ప్రభుత్వం త్వరలోనే నియంత్రణలను ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశలో భాగంగానే, ప్రతినెలా డీజిల్ ధరను పెంచడం జరుగుతోంది.


Click it and Unblock the Notifications








