ఆరు నెలల్లో ఆరు కొత్త మోటార్సైకిళ్లు: బజాజ్ ఆటో
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కోల్పోయిన తమ వాటాను తిరిగి దక్కించుకునేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే, రానున్న 6 నెలల్లో 6 సరికొత్త మోటార్సైకిళ్లను మార్కెట్లో విడుదల చేస్తామని, వీటిలో 100సీసీ బైక్లతో పాటు 400సీసీ పల్సర్ మోడళ్లు కూడా ఉంటాయని కంపెనీ తెలిపింది.
తాము విడుదల చేయాలనుకున్న ఆరు మోడళ్లలో ముందుగా, ఈ ఏడాది మార్చ్ నాటికి ఓ కొత్త 100 సీసీ బైక్ను విడుదల చేస్తామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎష్యూరెన్స్) ఎస్. రవికుమార్ తెలిపారు. ప్రస్తుతం 16-17 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.

ప్రస్తుతం తాము 100సీసీ సెగ్మెంట్లో విక్రయిస్తున్న బజాజ్ ప్లాటినా బైక్ మంచి ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుందని, ఎగ్జిక్యూటివ్లకు కూడా ఇది చక్కగా సూట్ అవుతుందని రవికుమార్ చెప్పారు. కాగా.. 100సీసీ సెగ్మెంట్లో తాము కొత్తగా ప్రవేశపెట్టనున్న మోడల్, ప్రస్తుత ప్లాటినా అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా.. బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి 13,91,341 యూనిట్లు విక్రయించగా.. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో16,05,308 యూనిట్లను విక్రయించింది. అంటే దాదాపు కంపెనీ మొత్తం అమ్మకాలు 13.33 శాతం క్షీణించాయి. కొత్త మోడళ్ల విడుదలతో నైనా అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీ ధీమాగా ఉంది.


Click it and Unblock the Notifications








