మార్కెట్ నుండి నాలుగు ఉత్పత్తులను తొలగించనున్న హీరో
ఇండియన్ మార్కెట్లో అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థలలో హీరో మోటోకార్ప్ ఒకటి, అయినప్పటికీ దీనికి కూడా తమ ఉత్పత్తుల నిష్క్రమణ బాధ తప్పలేదు. హీరో లైనప్లో ఉన్న నాలుగు ఉత్పత్తులను తొలగించనుంది. యువ కొనుగోలుదారులను ఆకర్షించడానికి కొన్ని కొత్త ఉత్పత్తులను అందివ్వడానికి సిద్దం అవుతూనే తక్కువ అమ్మకాలు సాధిస్తున్న నాలుగు మోడళ్లను అమ్మకాల నుండి నిష్క్రమింపచేయనున్నట్లు తెలిసింది.

ఇలా నాలుగు మోడళ్లను అమ్మకాల నుండి నిలిపివేయడానికి మరో కారణం కూడా ఉంది. హీరో మోటోకార్ప్ హోండా సంస్థకు ఈ నాలుగు ఉత్పత్తులకు సంభందించి రాయల్టీ సొమ్మును కూడా చెల్లిస్తోంది. మార్కెట్ నుండి విరమించుకుంటున్నహీరో వారి ఉత్పత్తుల్లో ఇంపల్స్, ఇగ్నిటర్, ప్యాసన్ ఎక్స్ప్రొ మరియు మాయెస్ట్రో వంటివి ఉన్నాయి.
హీరో మోటోకార్ప్ ఈ ఏడాదిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి మాయెస్ట్రో ఎడ్జ్, డ్యూయెట్ మరియు స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 లు ఉన్నాయి. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం హీరో రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రస్తుతం హీరో లైనప్లో ఉన్న ప్లెజర్ హోండా వారి మెషినరీ మీద ఆధారపడి ఉంది. అయితే మాయెస్ట్రో ఎడ్జ్ మరియు డ్యూయెట్ లలో వినియోగించిన ఇంజన్ను ప్లెజర్లో అందించి పూర్తిగా హీరో మోటోకార్ప్ ఉత్పత్తిగా తీర్చిదిద్దనున్నారు.
Also Read: విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో వాహనాలు నడిపితే తప్పనిసరిగా ఇవి పాటించండి
ఇక ప్యాసన్ ఎక్స్ప్రో విషయానికి వస్తే దీనిని మార్కెట్ నుండి తొలగించిన అనంతరం సరికొత్త డిజైన్లో స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 లో అందించిన ఇంజన్ తరహాలో నూతన ఇంజన్ను అభివృద్ది చేసి మరలా నూతన శైలిలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తక్కువ అమ్మకాలు నమోదుచేసుకున్న కారణంగా ఇంపల్స్ మరియు ఇగ్నిటర్ బైకులను తిరిగి విడుదల చేసే అవకాశాలు ఏ మాత్రం లేవు.


Click it and Unblock the Notifications








