చెప్పులేసుకుని బండి నడిపితే వెయ్యి, లుంగీ కడితే 2 వేలు ఫైన్.. జైలు కూడా!!
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీ మొత్తంలో పెంచిన సంగతి తెలిసిందే. అయితే భారీ జరిమానాలు విధిస్తున్న కేసులు అధికమవ్వడంతో మోటారు వాహనాల చట్టం ప్రకారం ఎప్పటి నుండో రూల్స్ను తూ.చ. తప్పకుండా పోలీసులు అమలు చేస్తున్నారు. అందులో బండినడిపేటప్పుడు చెప్పులు, శాండిల్స్ వేసుకోవడం మరియు లారీ నడిపేటప్పుడు లుంగీ కట్టుకోవడం ఇలా చట్టంలో ఉండి ఇప్పటి వరకు సరిగ్గా అమలు కాని రూల్స్ను అమలు చేస్తున్నారు.

అవును, మీరు చదివింది నిజమే.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేయకున్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెప్పులు వేసుకుని వాహనం నడిపినా ఇక నుండి చలానా విధిస్తారని తెలుస్తోంది. అయితే ఈ రూల్ ఎప్పటి నుండో ఉన్నా ఈ చట్టంతో పాటు అమలు చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ రూల్ ప్రకారం చెప్పులు లేదా శాండిల్స్ లాంటివి ధరించి వాహనాలను నడపడం నేరంగా పేర్కొంటున్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధిస్తారు.

రెండో సారి కూడా అలాగే చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 15 రోజుల పాటు జైలుశిక్షకి కూడా అవకాశం ఉందని అంటున్నారు. ఇక లారీ డ్రైవర్లు లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

నిజానికి 1989 నాటి మోటారు వాహనాల చట్టం కింద లారీలే కాక బస్సులు, వ్యాన్లు, ఇతర పెద్ద వాహనాలను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఫుల్ సైజు ప్యాంటు, షర్టు ధరించి, షూ కూడా వేసుకోవాలి. దీన్ని ఉల్లంఘిస్తే పాత చట్టం కింద రూ. 500 జరిమానా విధించేవారు.

అన్ని జరిమానాలను భారీగా పెంచేసిన కొత్త చట్టం దీన్ని కూడా రూ. 2000 లకు పెంచింది. ఈ నియమాలన్నీ వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పద్దతిగా రహదారి నియమాలను మరియు ట్రాఫిక్ చట్టాన్ని పాటిస్తే జరిమానాలకు భయపడాల్సిన అవసరంలేదని అధికారులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








