2021 డాకార్ ర్యాలీ డేట్స్ కన్ఫర్మ్, సౌదీ అరేబియాలో రేస్
ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన ర్యాలీల్లో ఒకటైన డాకార్ ర్యాలీ (Dakar Rally) 2021 సీజన్ తేదీలను నిర్వాహకులు ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి నెలలో సౌదీ అరేబియాలోని ఇసుక ఎడారిలో 2021 డాకార్ ర్యాలీని నిర్వహించనున్నారు. జవరి 3, 2021 నుంచి జనవరి 15, 2021 వరకూ ఈ ర్యాలీ జరగనుంది.

జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య గుండా ఈ రూట్ మ్యాప్ ఉంటుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గతేడాది మాదిరిగానే ఈ రేసును కేవలం సౌదీ అరేబియా ప్రాంతంలో మాత్రం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈవెంట్ నిర్వహాకులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 డాకార్ ర్యాలీని గతేడాది నిర్వహించిన రూట్లో కూడా ఈసారి పూర్తిగా కొత్త రూట్లో నిర్వహించనున్నారు. పూర్తిగా ఇసుక దిబ్బలతో నిండిపోయి, మానవ మనుగడ లేని ప్రాంతంలో ఎత్తైన ఇసుక కొండలు, లోతైన దిగుడు ప్రాంతాల గుండా ఈ రేస్ సాగనుంది. ఈ రేస్ నిర్వహించే ప్రాంతంలో కొన్ని చోట్ల స్పీడ్ జోన్స్ మరికొన్ని చోట్ల స్లో జోన్స్ ఉంటాయి.

కాగా.. ఈ 2021 సీజన్ డాకార్ ర్యాలీని సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలోని పోర్ట్ సిటీ అయిన రెడ్ సీ వద్ద ప్రారంభమైన మొత్తం 12 స్టేజ్లను పూర్తి చేసుకొని తిరిగి రెడ్ సీ ప్రాంతం వద్ద ముగియనుంది. జనవరి 3న రెడ్ సీ వద్ద ఈ రేస్ మొదలు పెట్టిన వారు అన్ని స్టేజ్లను దాటుకుంటూ వచ్చి జనవరి 15న రెడ్ సీ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అంటే 12 రోజుల పాటు రేస్ చేస్తూ ఎవరైతే ముందుగా అక్కడికి చేరుకుంటారో వారే ఈ ర్యాలీలో విజేతగా నిలుస్తారు.

ఈ రూట్కి సంబంధించిన పూర్తి వివరాలను, స్టేజ్ల వారీ రూట్ మ్యాప్ను ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ 42 ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న డాకార్ ర్యాలీ టీమ్, ఈసారి నిర్వహిస్తున్న 43వ ఎడిషన్లో మెయిన్ రేస్కు అదనంగా డాకార్ క్లాసిక్ అనే కాంపిటీషన్ను కూడా నిర్వహించనున్నారు. గడచిన 2000 దశకంలో ఈ రేస్లో పాల్గొన్న కార్లు, ట్రక్కులు తిరిగి మళ్లీ ఈ డాకార్ క్లాసిక్ రేసులో కనిపించబోతున్నాయి.

ఇదివరకటి మాదిరిగానే మన దేశానికి చెందిన హీరో మోటోకార్ప్, మరియు టీవీఎస్ షెర్కో రేసింగ్ విభాగాలు యధావిధిగా ఈ రేసులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా అత్యంత కఠినమైన ర్యాలీగా చెప్పుకునే డాకార్ ర్యాలీలో ఈ ఏడాది హీరో మోటోస్పోర్ట్ తరఫున భారతదేశపు ప్రముఖ రైడర్ సి.ఎస్. సంతోష్ పార్టిసిపేట్ చేయనుండి టీవీఎస్ షెర్కో ర్యాలీ రేసింగ్ టీమ్ తరఫున హరినాథ్ నోవా తొలిసారిగా పార్టిసిపేట్ చేయనున్నారు.

ప్రతి డాకార్ ర్యాలీలో కూడా విభిన్న స్టేజీలలో రేస్ ఉంటుంది. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ రేసులో పాల్గొనే అభ్యర్థలు ఒక్క రోజు ముందే తర్వాతి రోజు ప్రత్యేక స్టేజ్ సంబంధించిన రోడ్బుక్లను అందించడం జరుగుతుంది. గతేడాది 2020 డాకార్ ర్యాలీ నుంచి ఈ కీలకమైన మార్పును చేయటం జరిగింది. రైడర్ల భద్రత కోసమే ఈ మార్పులను చేశారు, భవిష్యత్తులో జరగబోయే ర్యాలీల్లో కూడా ఇదే కొనసాగించనున్నారు.

గడచిన సీజన్లో రైడర్ల సేఫ్టీ కోసం మరో కొత్త సీజన్ను కూడా జోడించారు. అదేంటంటే.. రైడర్ల బైక్లకు ఓ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. దీని సాయంతో రైడర్ స్థానాన్ని నిర్వాహకులు ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా రైడర్ తప్పు దారిలో వెళ్తున్నా లేదా ఏదైనా స్టేజ్కి సంబంధించి ప్రమాదకరపు ప్రాంతాన్ని చేరుకున్నా సదరు రైడర్లను వారు ఈ డివైజ్ సాయంతో హెచ్చరిస్తారు. ఇది వారిని ఆడియో రూపంలో అలెర్ట్ చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ ర్యాలీలో రైడర్ల భద్రత కోసం ఎయిర్బ్యాగ్తో కూడిన జాకెట్లను కూడా ఇప్పుడు తప్పనిసరి చేశారు.

అంతేకాదు.. ఈ రైడ్ మొత్తం పూర్తయ్యే లోపుగా ఇందులో పాల్గొనే రైడర్లు కేవలం ఆరు సార్లు మాత్రమే వెనుక టైరును మార్చుకునేలా కొత్త రూల్ పెట్టారు (ఈ ర్యాలీలో టైర్లు త్వరగా అరిగిపోతాయి లేదా పాడైపోతాయి). అలాగే రీఫ్యూయెల్ చేసుకునేటప్పుడు బైక్కు ఎలాంటి మెయింటినెన్స్లు చేయకూడదు. ఈ మార్పుల వలన రైడర్ బైక్ నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా, ఏకాగ్రతతో ఉంటారనేది నిర్వాహకుల అభిప్రాయం.

2020 డాకార్ ర్యాలీపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
డాకార్ ర్యాలీ అనేది ప్రపంచంలో కెల్లా అత్యంత పాపుల్ అయిన అంతే ప్రమాదకరమైన బైక్ ర్యాలీ. వెళ్లే రూట్ గురించి ముందుగా తెలియదు, అడవులు, కొండలు, వాగులు, లోయలు వంటి ప్రమాదరమైన రూట్లో బైక్ను సుమారు రెండు వారాల పాటు నడపాల్సి ఉంటుంది. వాస్తవానికి అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి ఇదొక సరికొత్త అనుభూతిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








