టీవీఎస్ టీజర్ వీడియోలో అమితాబ్-ధోని : కొత్తగా ఏం విడుదలవుతోంది?
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో పూర్తిగా ఏదో క్రొత్తదాన్ని ప్రవేశపెట్టడానికి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. హోసూర్కు చెందిన ఈ టూవీలర్ బ్రాండ్ బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ మరియు క్రికెట్ దిగ్గజం ఎమ్ఎస్ ధోని లపై చిత్రీకరించిన రెండు కొత్త టీజర్ వీడియోలను విడుదల చేసింది.

ఈ టీజర్ వీడియోలో స్వయంగా ఏ విషయాన్ని వెల్లడించలేదు. కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ ‘భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక' అంటారు, ఆ వెంటనే ధోని 'కెప్టెన్ కూల్, భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక అంటే ఏంటి?' అంటూ ప్రశ్నిస్తారు. అంతటితో ఈ టీజర్ వీడియో ముగుస్తుంది.
టీవీఎస్ విడుదల చేసిన ఈ టీజర్ వీడియో ఇప్పుడు చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. అమితాబ్ బచ్చన్ మరియు ఎమ్ఎస్ ధోని ఇద్దరూ కొంతకాలం టీవీఎస్ మోటార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే.

అమితాబ్ బచ్చన్ గత కొన్ని సంవత్సరాలుగా టీవీఎస్ జూపిటర్ స్కూటర్కు ప్రచారం చేయగా, ఎమ్ఎస్ ధోని ఆ బ్రాండ్ యొక్క స్టార్ సిటీ కమ్యూటర్ మోటార్సైకిల్కు ప్రచారం చేశారు. టీవీఎస్ ప్రధాన మోడల్ అపాచీ ఆర్ఆర్310 ప్రారంభోత్సవంలో ధోని చివరిసారిగా కనిపించారు.

కాగా.. తాజాగా విడుదలైన టీజర్ వీడియోలు దేనిని సూచిస్తాయనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. టీవీఎస్ మోటార్ ఒక సరికొత్త ఉత్పత్తిని పరిచయం చేయవచ్చని తెలుస్తోంది. బహుశా ఇది టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ బైక్ లేదా టీవీఎస్ జెప్పెలిన్ క్రూయిజర్ మోటార్సైకిల్ విడుదల గురించి అయి ఉండొచ్చని అంచనా.

అయితే, టీవీఎస్ నుండి వచ్చిన వీడియోల శీర్షికను ‘మొదటిసారి అనుభవానికి వేచి ఉండండి' అని పేర్కొన్నారు. భవిష్యత్ ఉత్పత్తుల కోసం టీవీఎస్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతుందని ఇది సూచిస్తుంది. ఈ టీజర్ వీడియో టీవీఎస్-నార్టన్ కంపెనీల విలీనానికి సంబంధించినది కూడా అయి ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

అయితే, ఇవన్నీ ఈ సమయంలో వస్తున్న ఊహాగానాలు మాత్రమే. టీవీఎస్ కొత్తగా ఏం ఆవిష్కరించనుందో లేదా అందుకు సంబంధించిన తేదీని, సమయాన్ని కానీ ఈ వీడియోలో చేర్చలేదు. ఇందులో కేవలం ‘త్వరలో వస్తుంది' అని మాత్రమే పేర్కొన్నారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో చివరి సారిగా ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్. లాక్డౌన్కి కొద్ది రోజుల ముందే ఈ స్కూటర్ను ప్రారంభించారు. అంతే కాకుండా, దేశంలో తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కంపెనీ అందిస్తున్న ఇతర మోడళ్లపై కూడా అనేక అప్డేటెడ్ వెర్షన్లను విడుదల చేసింది.

టీవీఎస్ టీజర్ వీడియోపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా అమితాబ్ బచ్చన్ మరియు ఎమ్ఎస్ ధోని ఇద్దరినీ ఒకే వేదికపై కలపడాన్ని చూస్తుంటే, కంపెనీ ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బ్రాండ్ మన కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఓపిక పట్టక తప్పదు.


Click it and Unblock the Notifications








