కేరళ మార్కెట్లోకి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ - మొదటి దశ విస్తరణ ప్రణాళిక
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా మరిన్ని కొత్త నగరాల్లో తమ సేవలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తమ మొదటి దశ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో తమ పాపులర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఏథర్ ఎనర్జీ తమ మొదటి దశ విస్తరణ ప్రణాళికలో భాగంగా దేశంలోని 10 ప్రధాన నగరాల్లో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఈ జాబితాలో 11వ నగరంగా కోజికోడ్ను చేర్చింది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రీ-ఆర్డర్లు, డీలర్షిప్ అభ్యర్థనలు మరియు టెస్ట్ రైడ్ల కోసం వచ్చిన అభ్యర్థనల పరిమాణాన్ని బట్టి మొదటి దశలో కొత్త మార్కెట్లను చేర్చడానికి కారణమయ్యాయి.

ప్రస్తత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, కోల్కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సిఆర్, ముంబై, పూణే, కోజికోడ్ నగర రోడ్లపైకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఏథర్ ఎనర్జీ తమ ఫాస్ట్ ఛార్జింగ్ పబ్లిక్ నెట్వర్క్ - ఏథర్ గ్రిడ్ను ఏర్పాటు చేయడానికి సాధ్యమయ్యే ప్రదేశాల కోసం తమ భాగస్వాములతో కలిసి ఇప్పటికే పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో మాల్స్, కాఫీ షాపులు, రెస్టారెంట్లు, టెక్ పార్కులు మరియు వివిధ కార్యాలయాలు ఉన్నాయి.

కోజికోడ్లోని రెండు ఔట్లెట్లలో ఏథర్ గ్రిడ్ను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఇప్పటికే ఒక ప్రముఖ కేఫ్ చైన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏథర్ ఎనర్జీ స్కూటర్లను నగరంలో ప్రారంభించడానికి ముందే మొదటి దశలో భాగంగా ప్రతి నగరంలో కనీసం 10 నుండి 15 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే బెంగళూరు మరియు చెన్నై నగరాల్లో 52 ఏథర్ గ్రిడ్ పాయింట్లను ఏర్పాటు చేసింది ఈ చార్జింగ్ పాయింట్లను ఇతర ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు మరియు టూవీలర్ వాహనాలు కూడా ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా నవంబర్ 2020 నాటికి ఏథర్ 450ఎక్స్ డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

ఏథర్ ఎనర్జీ 2021 చివరి నాటికి 20 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. దీనికి అదనంగా, కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుతం హోసూర్లో ఏర్పాటు చేయబడుతున్న కొత్త ఉత్పాదక ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచనున్నారు.

ఈథర్ ఎనర్జీ ప్రకారం, ఈ కొత్త ప్లాంట్ 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది ఏటా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేసేలా రూపొందించబడింది మరియు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని కావాలనుకుంటే 5,00,000 యూనిట్లకప విస్తరించుకునే సౌకర్యం ఉంది. ఈ ఏడాది చివరినాటికి వ్యాపార కార్యకలాపాల కోసం ఈ ప్లాంట్ను పూర్తి చేసి, దశల వారీగా విస్తరణ చేపట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్డేట్ల ద్వారా తమ ఉత్పత్తులను మెరుగుపరుస్తున్న భారతదేశపు మొట్టమొదటి ఆటోమొబైల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ. ఇందులో కొత్త రైడ్ మోడ్లు, కొత్త ఫీచర్లు మరియు రైడ్ అండ్ ఓనర్షిప్ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరిచే అంశాలు ఉంటాయి. ఇప్పటివరకు, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు ఓటిఏ సాఫ్ట్వేర్ అప్డేట్లను అందుకుంది.

ఏథర్ ఎనర్జీ మొదటి దశ విస్తరణ ప్రణాళికపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కొత్త నగరాలను జోడించి, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం ద్వారా మొదటి దశ విస్తరణ ప్రణాళికను వేగవంతం చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఏథర్ అందిస్తున్న ఫ్లాగ్షిప్ మోడల్ 450 ఎక్స్ ఈ విభాగంలో మంచి ప్రాచుర్యం పొందిన మోడల్. మరికొద్ది రోజుల్లోనే ఏథర్ హైదరాబాద్ నగరంలోకి కూడా ప్రవేశించనుంది.


Click it and Unblock the Notifications








