ఈ బుల్లెట్ బాయ్ మామూలోడు కాదు: 11 నెలల్లో 101 తప్పులు; రూ.57,200 ఫైన్
వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇప్పటి వరకూ రూ.57,200 జరిమానా విధించారు. నగరంలోని ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ యజమాని గడచిన 11 నెలల్లో 101 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ యజమాని పేరు రాజేష్ కుమార్ (25 ఏళ్లు), ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ప్రభుత్వానికి కట్టాల్సిన పెనాల్టీలను చెల్లించేందుకు ఆయనకు మూడు రోజుల గడువును మాత్రమే ఇచ్చారు. ఒకవేళ రాజేష్ కుమార్ తన బకాయిలను అన్నింటినీ క్లియర్ చేస్తే, నగరంలోనే అత్యధిక పెనాల్టీ చెల్లించిన వ్యక్తిగా నిలిచే అవకాశం ఉంది.

రాజేష్ యాజమాన్యంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను అదుగోడి ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 2019 సెప్టెంబరు నుండి ఆగస్టు 26, 2020 వరకు ఉన్న అన్ని చలాన్లను క్లియర్ చేయమని కోరుతూ వారు అతనికి నోటీసు జారీ చేసినట్లు సమాచారం.

దర్యాప్తు అధికారి టిఓఐకి తెలిపిన వివరాల ప్రకారం, ఇచ్చిన గడువులోగా తన బకాయిలను తీర్చడంలో రాజేష్ కుమార్ విఫలమైతే, ఆ విషయం కోర్టులకు పంపబడుతుంది. రాజేష్ అప్పుడు కోర్టుకు హాజరుకావడంతో పాటుగా జరిమానాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అతని మోటారుసైకిల్ను విడుదల చేయటం జరుగుతుంది.

పోలీసు నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ యజమానిపై హెల్మెట్ లేకుండా స్వారీ చేసినవి 41 కేసులు, హెల్మెట్ ధరించని పిలియన్ రైడర్ కేసులు 28, స్వారీ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగించిన కేసులు 10, నో ఎంట్రీ కేసులు 6, సిగ్నల్ జంపింగ్లో 5 కేసులు ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు లేన్ డిసిప్లేన్కు సంబంధించి 3 కేసులు, వ్రాంగ్ పార్కింగ్కు సంబంధించి మరో 3 కేసులు కూడా ఉన్నాయి.

విప్రో జంక్షన్ సమీపంలో ఉన్న కోరమంగళ ఐ బ్లాక్లో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు రాజేష్ను పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో రిజిస్ట్రేషన్ నెంబర్ను చెక్ చేయగా, 11 నెలలో అతడు ఉల్లంఘించిన అన్ని కేసుల వివరాలు బయటపడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు పంపగా, వారు మోటారుసైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.

రాజేష్ కుమార్ దొరికి సమయంలో అతడికి ప్రింట్ చేసిన చలాన్ పొడవు సుమారు 5.5 అడుగుల పొడవున్నట్లు సమాచారం. రాజేష్ కుమార్ ఎలక్ట్రానిక్ సిటీలో నివసిస్తున్నట్లు, అతని కార్యాలయం వైట్ఫీల్డ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఎక్కువ భాగం కేసులు ఒకే ప్రాంతంలో నమోదు చేయబడ్డాయి.

కోవిడ్-19 సమయంలో తక్కువ మంది పోలీసు సిబ్బంది రోడ్లను నిర్వహిస్తున్నారని, రాజేష్పై నమోదైన మొత్తం 101 ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల్లో 60 కేసులు ఏప్రిల్ 2020 తర్వాత జరిగినవేనని అధికారులు తెలిపారు.

గడచిన జూలైలో కూడా ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్లో స్పీడింగ్ చేస్తూ మరో బైకర్ పట్టుబడ్డాడు. సదరు బైకర్ తన 1000 సిసి యమహా ఆర్1 సూపర్బైక్ను సుమారు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అప్పట్లో సదరు రైడర్ను పోలీసులు అరెస్టు చేశారు, ఈ విషయాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది.

బైకర్కు భారీ ఫైన్ విధించడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
బెంగుళూరు వంటి అభివృద్ధి చెందిన మహా నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి సదరు యజమాని అజ్ఞానాన్ని ఈ భారీ జరిమానా స్పష్టంగా తెలియజేస్తోంది. ఇకనైనా అతను తన తప్పు తెలుసుకొని జాగ్రత్త వహించడం మంచిది. అతనే కాదు, వాహన చాలకులందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలను చక్కగా పాటిస్తూ, సురక్షితంగా గమ్యాలను చేరుకోవటం మంచిది.


Click it and Unblock the Notifications








