టెస్టింగ్ దశలో మహీంద్రా మోజో బిఎస్6; త్వరలో విడుదల - వివరాలు
మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న పవర్ఫుల్ మోటార్సైకిల్ 'మహీంద్రా మోజో' లో కంపెనీ ఓ కొత్త బిఎస్6 వెర్షన్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ను విడుదల చేయటానికి ముందు భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

ఆటోకార్ క్యాప్చూర్ చేసిన స్పై పిక్స్ను గమనిస్తే, మహీంద్రా టూవీలర్స్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా తమ కొత్త బిఎస్6 మహీంద్రా మోజో బైక్ను టెస్టింగ్ చేస్తోంది. క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తుండటాన్ని చూస్తుంటే అతి త్వరలోనే ఈ మోడల్ దేశీయ విపణిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి కొత్త మహీంద్రా మోజో బిఎస్6 బైక్ మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త మహీంద్రా మోజో బిఎస్6 వెర్షన్కి బిఎస్4 వెర్షన్కి ఇంజన్ అప్గ్రేడ్స్ మినహా డిజైన్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. మహీంద్రా మోజో 300 బిఎస్6 మోటార్సైకిలో ఇదివరకటి 294.72సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ బిఎస్4 ఇంజన్ 7500 ఆర్పిఎమ్ వద్ద 26.29 బిహెచ్పి శక్తిని, 5500 ఆర్పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. బిఎస్6 వెర్షన్లో ఈ ఇంజన్ పవర్ కాస్తంత తగ్గొచ్చని అంచనా.

మహీంద్రా మోజో మోటార్సైకిల్లో ఆకర్షణీయమైన డ్యూయెల్ హెడ్ల్యాంప్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 21-లీటర్ పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి బిఎస్4 మోడల్లోని అన్ని ఇతర డిజైన్ అంశాలు బిఎస్6 మోడళ్లలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మోటారుసైకిల్లో 815 మిమీ సీట్ హైట్ రైడర్కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇందులో ముందు వైపు 320 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్-ఛానెల్ ఏబిఎస్ ఉంటుంది, ఈ ఏబిఎస్ సిస్టమ్ను బైబ్రి కంపెనీ సప్లయ్ చేస్తోంది. ఇకపోతే ముందు వైపు టెలిస్కోపిక్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఈ బైక్లో పీరెల్లీ ఏంజెల్ సిటి టైర్స్ ఉండొచ్చని అంచనా.

ఈ బైక్ ఆకర్షనీయమైన మోడ్రన్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, మహీంద్రాకు టూవీలర్స్కు మార్కెట్లో పెద్దగా మార్కెట్ వాటా లేకపోవటంతో మహీంద్రా మోజో కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో మహీంద్రా మోజో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఇందులో మరో చవక వేరియంట్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బైక్ యూటి300 మరియు ఎక్స్టి300 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఇందులో మొదటిది బేస్ వేరియంట్, రెండవది టాప్-ఎండ్ వేరియంట్. ఈ రెండు వేరియంట్లలో దాదాపు అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి, బేస్ వేరియంట్లో మాత్రం ఒకవైపే ఎగ్జాస్ట్ ఉంటుంది. గతేడాది మహీంద్రా మోజో బైక్లో కంపెనీ ఈ రెండు వేరియంట్లకు నడుమన 'మోజో 300 ఏబిఎస్' అనే కొత్త వేరియంట్ను ప్రవేశపెట్టింది, కానీ ఆ మోడల్ ఆశించిన రీతిలో అమ్ముడుపోలేదు.

ఈ నేపథ్యంలో 2019లో మోజో మోటార్సైకిల్లో కేవలం ఒక వేరియంట్ను మాత్రమే ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ 2019 మోడల్లోని చాలా భాగాలు సస్పెన్షన్ సెటప్, ఎగ్జాస్ట్ సెటప్ మొదలైన వాటిని ‘యుటి 300' వేరియంట్ నుంచి గ్రహించారు. ధరను తగ్గించేందుకు ఈ మార్పులు చేసినప్పటికీ, మార్కెట్లో అప్పుడే విడుదలైన బజాజ్ డొమినార్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వంటి మోడళ్ల కారణంగా మోజో పోటీని తట్టుకోలేక అమ్మకాల పరంగా ఆశించిన వృద్ధిని కనబరచలేకపోయింది.

మహీంద్రా మోజో బిఎస్6 బైక్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మహీంద్రా తమ మోజో మోటార్సైకిల్ను తొలిసారిగా 2015లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మోడల్ను వెలుగులోకి తెచ్చేందుకు మహీంద్రా ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కవుట్ కాలదనే చెప్పాలి. మరి ఈ కొత్త బిఎస్6 వెర్షన్ మహీంద్రా మోజో కంపెనీకి ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








