మహీంద్రా ఎక్స్యూవీ500, థార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ అభిమానులకు చేదువార్త వెల్లడించింది. మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం ఎక్స్యూవీ 500, కొత్త తరం మహీంద్రా థార్ ఆఫ్ రోడర్లను విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ లేదా నాల్గవ త్రైమాసికంలో ఈ వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి, ఆ తర్వాత ప్రకటించిన లాక్డౌన్ల కారణంగా ఈ వాహనాల విడుదల ఆలస్యమైంది.

ఎకనామిక్ టైమ్స్ ఆటో ప్రకారం, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా ఈ విషయాన్ని ఖరారు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ఒక సవాలు మారిందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాహనాల డిమాండ్కు అనుగుణంగా వాహనాలను సరఫరా చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని అన్నారు.

ఈ విషయంపై నక్రా మాట్లాడుతూ, "మా ఉత్పత్తులు మరియు బ్రాండ్ల కోసం, ముఖ్యంగా గ్రామీణ భారతదేశం నుండి బలమైన డిమాండ్ వస్తోంది, ఈ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తులను సరఫరా చేయటానికి మేము ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కష్టపడుతున్నాము. షోరూమ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్కు ముందు 40 శాతం ఉన్న ఎంక్వైరీలు ఇప్పుడు 75 శాతానికి పెరిగాయ"ని అన్నారు.

రానున్న రోజుల్లో మరోసారి ఎలాంటి లాక్డౌన్ను ప్రకటించకపోయినట్లయితే, ప్రస్తుత వాహన డిమాండ్ను తీర్చడానికి సుమారు 30 మరియు 45 రోజుల మధ్య సమయం పడుతుందని మహీంద్రా పేర్కొంది.

ఈ సంక్షోభ సమయంలో గ్రామీణ మార్కెట్ల నుండి ఎక్కువ శాతం అమ్మకాలు నమోదు అవుతుయాని బ్రాండ్ భావిస్తోంది. మహీంద్రా మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్లు 50 శాతానికి పైగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా బొలెరో, స్కార్పియో మరియు జీటో మోడళ్లు అమ్ముడవుతాయి.

ఇక మహీంద్రా అమ్మకాల విషయానికి వస్తే, ఈ బ్రాండ్ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మకాల పరంగా మూడవ స్థానానికి పడిపోయింది. తాము లాభదాయకమైన వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, మార్కెట్ వాటా లాభాలు తమ లక్ష్యం కాదని మహీంద్రా గతంలో స్పష్టం చేసింది. ఈ సంస్థ ముఖ్యంగా ఎస్యూవీ విభాగంపై దృష్టి సారించనుంది, భవిష్యత్తులో మరిన్ని విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ఉంది.

ఈ విషయంపై నక్రా మాట్లాడుతూ, "ఎమ్ అండ్ ఎమ్ ఎల్లప్పుడూ బలమైన మరియు విభిన్నమైన ఎస్యూవీ ప్లేయర్గా నిలిచింది, అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త విభాగాలలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం దేశంలో ఎమ్పివిలు మరియు ఎస్యూవీలు వంటి పెద్ద వాహనాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటోంద"ని అన్నారు.

మహీంద్రా గ్రూప్ తమ ఉత్పత్తులను 100 శాతం భారతదేశంలోనే తయారుచేసేందుకు వీలుగా, చైనా నుండి దిగుమతి చేసుకునే కొన్ని విడిభాగాల ఉత్పత్తిని స్థానికంగానే కొనుగోలు చేయటం లేదా తయారు చేయటంపై కంపెనీ దృష్టి పెట్టింది. సదరు విడిభాగాలను స్థానికీకరించడం కోసం మూడు నుండి ఆరు నెలల మధ్య సమయం పడుతుందని, ఫలితంగా కొత్త ఉత్పత్తులను ప్రారంభించడంలో కొంత జాప్యం జరుగుతుందని మహీంద్రా తెలిపింది.

మహీంద్రా ఎక్స్యూవీ500, థార్ మోడళ్ల విడుదల జాప్యంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశంలో దాదాపు రెండు నెలలకు పైగా సాగిన పూర్తి లాక్డౌన్ మరియు ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు అనేక కార్ కంపెనీలు తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నాయి. మహీంద్రాపై కూడా ఇలాంటి ప్రభావమే పడింది. ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చేసిన ఈ రెండు మోడళ్లను మాస్ ప్రొడ్యూస్ చేయటం కోసం కంపెనీ గట్టిగా కృషి చేస్తోంది. వీలైనంత త్వరలోనే ఈ రెండు మోడళ్లు మార్కెట్లోకి రావాలని కోరుకుందాం!


Click it and Unblock the Notifications








