ప్రపంచంలోనే అత్యంత విలువైన టూవీలర్ కంపెనీగా 'బజాజ్ ఆటో'
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన టూవీలర్ బ్రాండ్గా అవతరించింది. గడచిన శుక్రవారం నాటికి బజాజ్ ఆటో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

జనవరి 1, 2021వ తేదీన జాతీయ స్టాక్ ఎక్సేంజ్లో కంపెనీ షేర్ ధర 1 శాతం పెరిగి ఒక్కో షేరుకు రూ.3,479 వద్ద ముగిసింది. దీంతో బజాజ్ ఆటో మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,00,670.76 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఆటో భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా కంపెనీ ఈ అరుదైన మైలురాయిని చేరుకోవటం విశేషం.

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇప్పటి వరకూ ఏ అంతర్జాతీయ ద్విచక్ర వాహన సంస్థ కూడా లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించలేదని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, తమ ద్విచక్ర వాహనాలను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇష్టపడుతున్నారని అన్నారు.

బజాజ్ ఆటో తమ వ్యాపార వ్యూహంలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను మరియు అమ్మకాల తర్వాత మెరుగైన సేవలను అందిస్తోందని అన్నారు. ఈ ప్రణాళికలే కంపెనీ విజయాలకు బాటలు వేశాయని, కంపెనీ వృద్ధిలో కొంత భాగం తమ భాగస్వామ్య సంస్థలది కూడా ఉందని రాజీవ్ బజాజ్ వివరించారు.

బజాజ్ ఆటో ప్రస్తుతం భారతదేశంలో బజాజ్, కెటిఎమ్ మరియు హస్క్వార్నా బ్రాండ్లకు చెందిన టూవీలర్లను విక్రయిస్తోంది. ఇందులో కెటిఎమ్, హస్క్వార్నాలు బజాజ్ ఆటో భాగస్వామ్య కంపెనీలు మరియు కంపెనీ ఈ బ్రాండ్ల మోడళ్లను భారతదేశంలోనే ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

కేవలం యూరప్ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ 'కెటిఎమ్'ను బజాజ్ ఆటో దక్షిణాసియా దేశాలకు కూడా పరిచయం చేసింది. ఆయా దేశాల్లో ఇది అతిపెద్ద ప్రీమియం స్పోర్ట్స్ బైక్ బ్రాండ్గా అవతరించింది. కెటిఎమ్ సాధించిన ఈ ఘనత చాలావరకు బజాగ్ ఆటోకే దక్కుతుంది.

బజాజ్ ఆటో ఈ అంతర్జాతీయ బ్రాండ్లకు అదనంగా, మరో బ్రిటీష్ లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్తో చేతులు కలిపింది. బ్రిటన్కు చెందిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ ట్రయంప్తో చేరి భారత్లో అత్యంత సరమైన టూవీలర్లను అందించేందుకు బజాజ్ ఆటో సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు తమ వ్యూహాత్మక కూటమిని కూడా ప్రకటించింది.

ప్రస్తుతం బజాజ్ ఆటో ప్రపంచంలో మూడవ అతిపెద్ద మోటార్సైకిళ్లు మరియు త్రీవీలర్ల తయారీదారుగా ఉంది. బజాజ్ ఆటోకు పూణేకి సమీపంలోని చాకన్ వద్ద, ఔరంగాబాద్ సమీపంలోని వాలూజ్ మరియు ఉత్తరాఖండ్లోని పంత్నగర్ వద్ద ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

కాగా, చాకన్ వద్ద మరో కొత్త ప్లాంట్ను ప్రారంభించేందుకు రూ.650 కోట్ల పెట్టుబడులను వెచ్చించడానికి కంపెనీ సిద్ధమైంది. ఈ మేరకు బజాజ్ ఆటో ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ కొత్త ప్లాంట్ను ప్రీమియం ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపయోగించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం, బజాజ్ ఆటో మార్కెట్లో పల్సర్ రేంజ్, ప్లాటినా, అవెంజర్ రేంజ్, డొమినార్ వంటి ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. గత సంవత్సరం, కంపెనీ తమ ఐకానిక్ బ్రాండ్ చేతక్ను పునరుద్ధరించి, ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదల చేసింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications