పెట్రో మంట వల్ల పెరిగిన ప్లాటినా సేల్స్; అధిక మైలేజ్ బైక్లకు పెరుగుతున్న ఆదరణ!
దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 115 లను దాటిపోయింది. ఈ ట్రెండ్ చూస్తుంటే పెట్రోల్ ధరలు ఇకపై తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో వాహన చాలకులు కూడా ఇప్పుడు తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్నారు. కొత్త కొనుగోలుదారులు అయితే, అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ప్రముఖ దేశీయ టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj AUto) విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్సైకిల్ 'బజాజ్ ప్లాటినా' (Bajaj Platina) అమ్మకాలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, ఈ బైక్ యొక్క అధిక మైలేజ్ అంశమే అని తెలుస్తోంది. భారతదేశంలో బజాజ్ ఆటో విక్రయిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్లలో ప్లాటినా కూడా ఒకటి.

బజాజ్ ప్లాటినా టూవీలర్ చాలా కాలంగా మార్కెట్లో ఉంది. ఒకప్పుడు ఈ బైక్ ధర రూ. 40,000 కన్నా తక్కువగా ఉండేది. అంతేకాదు, ఆ సమయంలో ఇది లీటరుకు 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ని క్లెయిమ్ చేసేది. అయితే, పెరుగుతున్న ఉత్పాదక వ్యయం మరియు మారుతున్న టెక్నాలజీ కారణంగా ఈ బైక్ ధర కూడా పెరిగింది మరియు మైలేజ్ స్వల్పంగా తగ్గింది.

అయినప్పటికీ, బజాజ్ ప్లాటినా ఇప్పటికీ భారత మార్కెట్లో లభిస్తున్న మోటార్సైకిళ్లలో కెల్లా చాలా చవకైనదిగా ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో బజాజ్ ప్లాటినా 100 సిసి కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 52,915 మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 58,042 గా ఉంది. కంపెనీ ఇందులో 110 సిసి వేరియంట్ ను కూడా అందిస్తోంది.

బజాజ్ ప్లాటినా 110 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 62,598 మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 67,904 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా సగటున లీటరుకు 70-75 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తాయి. అయితే, కొందరు కస్టమర్లు ఇంత కన్నా ఎక్కువ మైలేజ్ ను పొందుతున్నట్లు కూడా చెబుతున్నారు.

దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతుండటం మరియు ప్లాటినా బైక్ ఈ సెగ్మెంట్లోని ఇతర బైక్ ల కన్నా ఎక్కువ మైలేజీని ఇస్తుండటంతో ఈ మోడల్ అమ్మకాలు పెరిగాయి. గడచిన సెప్టెంబర్ 2021 నెలలో బజాజ్ ఆటో భారతదేశంలో 82,559 ప్లాటినా బైకులను విక్రయించింది. కాగా, సెప్టెంబర్ 2020 లో ఇవి కేవలం 55,496 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ప్లాటినా అమ్మకాలు గరిష్టంగా 49 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి.

బజాజ్ ప్లాటినా బైక్ లోని 100 సిసి ఇంజన్ చాలా అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. అలాగే, ఈ బైక్ ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, కస్టమర్లు దీనిని ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు. బజాజ్ ప్లాటినా బైక్ లో 100 సిసి, 4 స్ట్రోక్, డిటిఎస్-ఐ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్పిఎమ్ వద్ద 7.9 పిఎస్ శక్తిని మరియు 5,500 ఆర్పిఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

ప్రస్తుతం బజాజ్ ప్లాటినా 100 బైక్ కిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ అనే 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనితో పాటుగా బజాజ్ ప్లాటినా 110 ఎలక్ట్రిక్ స్టార్ట్ (Bajaj Platina 110 ES) మోడల్ కూడా అమ్మకానికి ఉంది. ఇందులో 115 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ ని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8.6 పిఎస్ పవర్ ను మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ ప్లాటినా భారత ఎంట్రీ లెవల్ కమ్యాటర్ మార్కెట్లో టీవీఎస్ స్పోర్ట్, టీవీఎస్ రేడియాన్ మరియు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వంటి బైక్ లతో పోటీ పడుతోంది. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి పెరుగుతున్నాయి. బజాజ్ ప్లాటినా బైక్ల అమ్మకాలు పెరగడానికి పెట్రోల్ ధరల పెరుగుదల ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సరసమైన ధర మరియు అత్యధిక మైలేజ్ వంటి అంశాలే మార్కెట్లో బజాజ్ ప్లాటినా బైక్ విజయానికి కారణం అయ్యాయి. దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నందున, చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అధికంగా ఉండటం మరియు ఛార్జింగ్ స్టేషన్ల కొరత వంటి అంశాల కారణంగా కస్టమర్లు ఇప్పుడు లో బడ్జెట్ మరియు హై మైలేజ్ టూవీలర్లకు ప్రధాన్యత ఇస్తున్నారు.

కాబట్టి, ప్రస్తుత పెట్రోల్ ధరల పెరుగుదల సెనారియాలో ఎక్కువ డబ్బు ఖర్చు చేసి, తక్కువ మైలేజీనిచ్చే ఖరీదైన టూవీలర్లను కొనడానికి బదులుగా, తక్కువ ధరతో అధిక మైలేజీనిచ్చే ప్లాటినా వంటి మోటార్సైకిళ్లను కొనుగోలు చేయటం చాలా ఉత్తమమైన పని. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications