కోవిడ్-19 ఎఫెక్ట్: మరింత ఆలస్యం కానున్న బజాజ్-ట్రైయంప్ మోటార్సైకిల్
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో మరియు బ్రిటీష్ లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ సంస్థల భాగస్వామ్యం నుండి రానున్న సరికొత్త బైక్ కోసం భారతదేశంలో ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే.

అయితే, దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా, విజృంభించిన కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా, ఈ కొత్త మోటార్సైకిల్ లాంచ్ మరో ఆరు నుంచి తొమ్మిది నెలల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యం నుండి రానున్న మొట్టమొదటి మోటార్సైకిల్ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షోరూమ్లను తాకే అవకాశం ఉంది.

దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రయాణ ఆంక్షలు (ట్రావెల్ రిస్ట్రిక్షన్స్) విధించారు. ఈ నేపథ్యంలో, ఇరు సంస్థలకు చెందిన ఇంజనీరింగ్ మరియు డెవలప్మెంట్ బృందాలు తమ తుది ఉత్పత్తి అభివృద్ధి కోసం వర్చువల్ సమావేశాలపై ఆధారపడవలసి వచ్చింది. ఫలితంగా, ఈ కొత్త మోటార్సైకిల్ అభివృద్ధి కూడా మందగించింది.

బజాజ్-ట్రైయంప్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త మోటార్సైకిల్ను భారత మార్కెట్లో ట్రైయంప్ బ్రాండ్ క్రింద విక్రయించనున్నారు. ట్రైయంప్ నుండి ఎంట్రీ లెవల్ మోడల్గా రానున్న ఈ కొత్త బైక్లో 250సిసి ఇంజన్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ను బజాజ్ ఆటో సరఫరా చేయవచ్చని సమాచారం.

ధర విషయానికి వస్తే, ఈ కొత్త బజాజ్-ట్రైయంప్ మోటార్సైకిల్ను కేవలం రూ.2 లక్షల కన్నా తక్కువ ధరకే విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బజాజ్ మరియు ట్రైయంప్ భాగస్వామ్యం నుండి కొత్తగా 250 సిసి మరియు 750 సిసిల మధ్యలో మోటార్సైకిళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

బజాజ్-ట్రైయంప్ నుండి రానున్న ఈ కొత్త మోటార్సైకిల్ లాంచ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయితే, ఇరు కంపెనీలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఓ ప్రోటోటైప్ను తయారు చేసినట్లు సమాచారం. కాకపోతే, ఈ ప్రోటోటైప్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది.

ఇండియన్ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో మరియు బ్రిటిష్ టూవీలర్ బ్రాండ్ ట్రైయంప్ సంస్థల మధ్య భాగస్వామ్యం 2017 లో ప్రారంభమైంది. అయితే, ఈ ఒప్పందం 2020 నాటికి ఓ సానుకూల నిర్ణయానికి వచ్చింది. ఇరు కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించడానికి కొత్త మోటార్సైకిళ్లను భారీగా స్థానికీకరించనున్నారు.

ఈ కొత్త భాగస్వామ్యం కింద పూణే సమీపంలోని బజాజ్ చాకన్ ప్లాంట్లో బైక్లను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్లో బజాజ్ ఆటో ఇప్పటికే 650 కోట్ల రూపాయల పెట్టుబడితో కెటిఎమ్, హుస్క్వర్ణా మరియు బజాజ్ మోటార్సైకిళ్ల ఉత్పత్తిని నిర్వహిస్తుంది. బజాజ్ మరియు ట్రైయంప్ నుండి రానున్న కొత్త బైక్లు ప్రస్తుతం 200 సిసి + విభాగంలో ఆధిపత్యం వహించే రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా నిలిచే అవకాశం ఉంది.
Source: Moneycontrol


Click it and Unblock the Notifications








