బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..
ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బిగాస్, గతేడాది జులై నెలలో ఎ2, బి8 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, అదే కంపెనీ ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన B8 మరియు A2 స్కూటర్లు మార్కెట్లో సహేతుకమైన విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది.

మార్కెట్లో కొత్త ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేసేందుకు గానూ బిగాస్, దేశంలో తమ బ్రాండ్ షోరూమ్లను భారీగా విస్తరించడంతో పాటుగా చాకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టబోయే రెండు స్కూటర్లను పూర్తిగా దేశీయంగా లభించే పరికరాలు, టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది దీపావళి నాటికి, భారతదేశంలోని టైర్ I మరియు II నగరాల్లో 35 షోరూమ్లకు తమ ఉత్పత్తులను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి భారతదేశ వ్యాప్తంగా 100 కి పైగా షోరూమ్లను ఏర్పాటు చేయాలని బిగాస్ ఎలక్ట్రిక్ ప్లాన్ చేస్తోంది.

గత సంవత్సరం అక్టోబర్ నెలలో తమ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ బిగాస్ బి8 ను విడుదల చేసినప్పటి నుండి ఈ మోడల్ కోసం భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించిందని, దేశంలో ఈ-వాహనాల పట్ల పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి తమ ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్ఫోలియోలో మరో రెండు కొత్త ఉత్పత్తులను జోడించడానికి సిద్ధంగా ఉన్నామని బిగాస్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కబ్రా తెలిపారు.

ఈ పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు ఉన్నతమైన రైడింగ్ అనుభూతిని కల్పించడమే కాకుండా, ఇవి ఎలక్ట్రిక్ మొబిలిటీ రవాణా యొక్క భవిష్యత్తును నిర్వచిస్తాయని ఆయన అన్నారు. భారతదేశంలో తయారైన ఈ 100 శాతం ఉత్పత్తులు మరింత మెరుగైన పనితీరు, సుదూర శ్రేణి, అధునాతన భద్రతా ఫీచర్లతో పాటుగా మెరుగైన సాంకేతికతను కలిగి ఉంటాయని హేమంత్ తెలిపారు.

ప్రస్తుతం బిగాస్ అందిస్తున్న బి8 మరియు ఎ2 ఎలక్ట్రిక్ స్కూటర్లలో తొలగించదగిన బ్యాటరీ, యాంటీ-తెఫ్ట్ అలారం, యాంటీ-తెఫ్ట్ మోటర్ లాకింగ్, ఎల్ఇడి ఇన్స్ట్రుమెంట్ పానెల్, మల్టీ-కలర్ డిజిటల్ డిస్ప్లే, డిఆర్ఎల్, కీలెస్ స్టార్ట్, ఫైండ్ యువర్ స్కూటర్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

అంతేకాకుండా, వీటిలో యుఎస్బి ఛార్జింగ్, రివర్స్ అసిస్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, 3 రైడింగ్ మోడ్స్ (లో, మీడియం, హై) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్లన్నీ ఐఓటి ఫీచర్ను కలిగి ఉంటాయి. వీటి కోసం కంపెనీ ప్రత్యేకమైన మొబైల్ యాప్ను కూడా డెవలప్ చేసింది.

బిగాస్ బి8 మరియు ఎ2 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా లీడ్-యాసిడ్ మరియు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తాయి. బిగాస్ ఎ2 లీడ్-యాసిడ్ బ్యాటరీ వెర్షన్ ధర రూ.52,499 గా ఉండా మరియు లిథియం అయాన్ బ్యాటరీ వెర్షన్ ధర రూ.67,999 గా ఉంది.

అలాగే, బిగాస్ బి8 లీడ్-యాసిడ్ బ్యాటరీ వెర్షన్ ధర రూ.62,999 కాగా, ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ వెర్షన్ ధర రూ. 82,999 గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). బిగాస్ బి8 స్కూటర్లో 1.9 కిలోవాట్ మోటార్ ఉంటుంది. ఇది 94.6 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి చార్జ్తో ఇది 70 కిమీ రేంజ్ను ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








