ఫేమ్ 2 సబ్సిడీ వలన ఎలక్ట్రిక్ టూవీల్ సేల్స్ పెరిగాయి: కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం FAME (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) అనే పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. గతేడాది కేంద్రం ఈ పథకం యొక్క రెండవ దశను (సెకండ్ ఫేజ్)ను ప్రారంభించింది. అంతేకాకుండా, గడచిన జూన్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే ఫేమ్ 2 సబ్సిడీలను కూడా భారీగా సవరించింది. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను పెంచడంలో FAME-II పథకం ఎంతగానో ఉపయోగపడిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది జూన్లో FAME-II స్కీమ్ను పునర్నిర్మించిన తర్వాత, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫేమ్ 2 పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వారానికి 700 యూనిట్ల నుంచి 5,000 యూనిట్లకు పైగా పెరిగాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 10,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకం యొక్క రెండవ దశను ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ముందస్తు సబ్సిడీని అందిస్తుంది మరియు ఈ పథకం కింద ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తుంది.

జూన్ 2021లో, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆటో పరిశ్రమ మరియు వినియోగదారుల నుండి వచ్చిన అనుభవం మరియు ఫీడ్బ్యాక్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం FAME-II పథకాన్ని పునఃరూపకల్పన చేసింది. కొత్త ఫేమ్ 2 పథకం క్రింద, ముందస్తు ధరను తగ్గించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగంగా వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 16 వరకు, 2021 సంవత్సరంలో మొత్తం 1.4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం యొక్క సవరించిన ఫేమ్ 2 పథకం కింద ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కేటాయించిన ప్రోత్సాహకాల విలువ దాదాపు రూ. 500 కోట్లు. ఈ ప్రోత్సాహకాలతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాల్లో 1.19 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20.42 వేల ఎలక్ట్రిక్ త్రీవీలర్లు మరియు 580 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు ఉన్నాయి. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు మొత్తం 1.85 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించినట్లు ప్రభుత్వం వివరించింది.

దేశంలో విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు మరియు సరసమైన మొబిలిటీ కారణంగా దేశంలో గతేడాది కాలంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ప్రజలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న అవగాహన కూడా వీటి అమ్మకాలకు ఆజ్యం పోసింది. మరోవైపు కోవిడ్-19 అనంతర పరిస్థితుల నేపథ్యంలో, ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను వదిలి వ్యక్తిగత రవాణా వైపు మొగ్గు చూపడం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుదలకు మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా, భారత మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఎంపికలు, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వినియోగదారుల మార్కెట్ సెంటిమెంట్ మారడం, రాష్ట్ర ప్రభుత్వాల EV విధానాల నుండి లభిస్తున్న అదనపు ప్రయోజనాలు కూడా వినియోగదారులను సాంప్రదాయ ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ) ఆధారిత ద్విచక్ర వాహనాల ఎంచుకోవడం కంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఎంచుకునే వైపే ప్రోత్సహించాయి.

ఇటీవల, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మరియు కర్ణాటక రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల పరంగా మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. అంటే, ఈ రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటివరకు 8,70,141 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. ఇవి కాకుండా, రిజిస్ట్రేషన్ అవసరం లేని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్ల వినియోగం కూడా పెరిగింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 2,55,700 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. అదే సమయంలో, ఢిల్లీలో 1,25,347 యూనిట్లు మరియు కర్ణాటకలో 72,544 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి, ఇది ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకు మంచి సూచనగా చెప్పుకోవచ్చు.

మొదటి ఐదు రాష్ట్రాల్లో బీహార్ 58,014 ఎలక్ట్రిక్ వాహనాలతో నాల్గవ స్థానం మరియు 52,506 ఎలక్ట్రిక్ వాహనాలతో మహారాష్ట్ర ఐదవ స్థానంలో నిలిచాయి. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం మరియు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం 2015లో భారతదేశంలో 'ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్ ఎండ్) ఎలక్ట్రిక్ వెహికల్స్' (FAME) అనే పథకాన్ని ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








