ఫిబ్రవరి 2021లో పెరిగిన ఈవీ సేల్స్; బ్రాండ్ వారీ డీటేల్స్!
దేశంలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం జోరందుకుంది. ఫిబ్రవరి 2021లో దేశవ్యాప్తంగా 6,059 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అమ్ముడయ్యాయి.

ఫిబ్రవరి 2020 అమ్మకాలతో పోల్చుకుంటే, ఇది 170 శాతం వృద్ధిని సాధించింది. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ టూవీలర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో హీరో ఎలక్ట్రిక్ మొదటి స్థానంలో ఉంటే, ఓకినావా రెండవ స్థానంలో నిలిచింది.

ఫిబ్రవరి 2021లో హీరో ఎలక్ట్రిక్ మొత్తం 2,201 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (ఫిబ్రవరి 2020లో) కంపెనీ అమ్మకాలు 614 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీ 258 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ మార్కెట్ వాటా కూడా 27 శాతం నుండి 36 శాతానికి పెరిగింది.

ఒకినావా గత నెలలో 1,059 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 664 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 59 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ వాటా కూడా 17 శాతం నుండి 29 శాతానికి పెరిగింది.

ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది ఆంపియర్ ఎలక్ట్రిక్. ఈ కంపెనీ గత ఫిబ్రవరి 2021లో మొత్తం 800 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఈ అమ్మకాల సంఖ్య 286 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో ఆంపియర్ అమ్మకాలు 179 శాతం వృద్ధి చెందగా, కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం నుండి 13 శాతానికి పెరిగింది.

ఎథర్ ఎనర్జీ సంస్థ అమ్మకాలు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2021లో కంపెనీ 624 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 369 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 69 శాతం వృద్ధి చెందగా, కంపెనీ మార్కెట్ వాటా 10 శాతం నుండి 16 శాతానికి పెరిగింది.

ప్యూర్ ఎనర్జీ ఈ జాబితాలో టాప్ 5 లో ఉంది. ఫిబ్రవరి 2021లో ఈ సంస్థ 404 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 0 శాతం నుండి 6 శాతానికి పెరిగింది.

ఇక ఆ తరువాతి స్థానాల్లో స్థానిక కంపెనీ అయిన బెనెల్లింగ్ ఇండియా ఉండగా, తదుపరి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ కేవలం ఒకే ఒక ఉత్పత్తిని (ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్)ను మాత్రమే ఈ విభాగంలో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా, సంస్థ గత నెలలో కేవలం 111 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ జాబితాలో బజాజ్ ఆటో 9వ స్థానంలో నిలిచింది.

మ్యూ ఎలక్ట్రికల్స్, రివాల్ట్ ఇంటెలికార్ప్, గోగ్రీన్ ఈ-మొబిలిటీ వంటి సంస్థలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలోకి తాజాగా ప్రవేశించిన గోవా బేస్డ్ కబీరా మొబిలిటీ, తమ మొదటి బ్యాచ్ మొత్తం పూర్తిగా బుకింగ్ అయినట్లు ప్రకటించినప్పటికీ, వాటి డెలివరీలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో, ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

దేశంలోని విభాగాలు ఇప్పటికీ కోవిడ్ను ఎదుర్కొంటుండగా, ఎలక్ట్రిక్ వాహన విభాగం అమ్మకాలు మాత్రం క్రమంగా మెరుగుపడుతున్నాయి. తాజాగా పెరుగుతున్న ఇంధన ధరల సమస్య వీటి అమ్మకాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. భవిష్యత్తులో వీటి తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








