అలనాటి భారత క్లాసిక్ స్కూటర్ కంపెనీ, ఇప్పుడు పూర్తిగా మూతపడనుంది!
లాంబ్రేట్టా, విజయ్ సూపర్ వంటి ప్రసిద్ధ స్కూటర్లను తయారుచేసిన ప్రభుత్వ రంగ ఆటోమొబైల్ సంస్థ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ త్వరలో మూతపడనుంది. ఈ సంస్థను మూసివేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

గత బుధవారం జరిగిన సమావేశంలో లక్నోకు చెందిన స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ను మూసివేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

లాంబ్రేట్టా, విజయ్ సూపర్, విక్రమ్ మరియు లాంబ్రో వంటి ప్రసిద్ధ బ్రాండ్లను ఈ కంపెనీ కలిగి ఉన్నందున స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరు విడిగా విక్రయించబడుతుందని మీడియా వర్గాలు తెలిపాయి. విక్రమ్ బ్రాండ్ కింద కంపెనీ అనేక రకాల త్రీ వీలర్లను కూడా ఉత్పత్తి చేస్తోంది.

ఈ సంస్థను మూసివేసే ప్రతిపాదన పట్ల ప్రభుత్వం ముందుకు సాగడం వలన, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సదరు సంస్థను మూసివేసే ప్రక్రియను ప్రారంభించడానికి మార్గం సుగమం కానుంది.

కేబినెట్కు సమర్పించిన ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ను మూసివేయడానికి రూ.65.12 కోట్లు అవసరమవుతాయి. కంపెనీ ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం నుండి వడ్డీతో కూడిన రుణంగా కోరినట్లు సమాచారం.

స్వచ్ఛంద పదవీ విరమణ పథకం / స్వచ్ఛంద విభజన పథకం (విఆర్ఎస్ / విఎస్ఎస్) క్రింద సంస్థను మూసివేసే ప్రతిపాదన ప్రకారం ఈ మొత్తం లభించిన తరువాత, దానిని సంస్థ యొక్క సాధారణ ఉద్యోగులకు అందించం జరుగుతుంది.

ఒక్క లక్నో ప్రధాన కార్యాలయంలోనే సుమారు 100 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు విఆర్ఎస్ / విఎస్ఎస్ను స్వీకరించడానికి ఇష్టపడకపోయినట్లయితే, వారిని పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 ప్రకారం కంపెనీ నుండి తొలగిస్తారు.

అంతేకాకుండా, కంపెనీ భూమిలో 147.49 ఎకరాలను పరస్పరం అంగీకరించిన రేట్లపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి అథారిటీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

కంపెనీల చట్టం ప్రకారం, సంస్థను మూసివేయడానికి ముందే దాని వాటాలన్నీ స్టాక్ మార్కెట్ నుండి ఉపసంహరించబడతాయి. ఈ సంస్థను కాపాడేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఇన్వెస్టర్ కోసం వెతికింది. కానీ, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు కంపెనీని మూసివేయాలనే నిర్ణయం తీసుకుంది.

స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 1972లో త్రీ వీలర్ తయారీదారుగా ప్రారంభమైంది. ఆ తర్వాత 1975లో ఈ కంపెనీ వాణిజ్య స్కూటర్ల తయారీని ప్రారంభించింది. ఈ స్కూటర్లను లాంబ్రేట్టా పేరుతో ఎగుమతి చేయగా, భారతదేశంలో విజయ్ సూపర్ పేరుతో విక్రయించారు. కాగా, 1997లో కంపెనీ తమ ద్విచక్ర వాహనాల వ్యాపారాన్ని నిలిపివేసి, కేవలం త్రీ-వీలర్ల తయారీ మరియు మార్కెటింగ్పై మాత్రమే దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications








