కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: 4 హోండా టూవీలర్ ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!
హీరో మోటోకార్ప్ బాటలోనే భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ) కూడా తమ నాలుగు ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హెచ్ఎంఎస్ఐకి చెందిన మనేసర్ (హర్యానా), తపుకర (రాజస్థాన్), నర్సాపురా (కర్ణాటక) మరియు విఠాలాపూర్ (గుజరాత్) టూవీలర్ ప్లాంట్లలో 15 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

పైన పేర్కొన్న ప్లాంట్లలో మే 1, 2021వ తేదీ నుండి మే 15, 2021వ తేదీ వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఈ షట్డౌన్ సమయాన్ని వార్షిక నిర్వహణ కార్యకలాపాల (యాన్యువల్ మెయింటినెన్స్) కోసం ఉపయోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పటికే హీరో మోటోకార్ప్ లిమిటెడ్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, ఎమ్జి మోటార్ ఇండియా మరియు టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా కంపెనీలు కూడా ఇదే కారణం చేత తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్న సంగతి తెలిసినదే.

హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 22 నుండి మే 1 వరకూ తమ ప్లాంట్ను మూసివేయగా, మారుతి సుజుకి మే 1 నుండి మే 9 వరకు హర్యానా మరియు గుజరాత్లోని తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఎమ్జి మోటార్ కంపెనీ కూడా ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకూ గుజరాత్లోని తమ హోలోల్ ప్లాంట్ను మూసివేస్తున్నట్లు తెలిపింది.

"కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ మరియు దేశంలోని వివిధ నగరాల్లో విధిస్తున్న లాక్డౌన్ల వంటి ప్రస్తుత తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా, హెచ్ఎంఎస్ఐ మొత్తం 4 ప్లాంట్లలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఇది 1 మే, 2021 నుండి అమలులోకి వస్తుంది".

"తాత్కాలిక ఉత్పత్తిని నిలిపివేసిన సమయాన్ని (మే 1 నుండి మే 15, 2021 వరకు) కంపెనీ తన వార్షిక నిర్వహణ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటుంది. ముందు రోజుల్లో కోవిడ్-19 పరిస్థితి మరియు మార్కెట్ రికవరీని బట్టి, హోండా తదుపరి నెలల్లో దాని ఉత్పత్తి ప్రణాళికను సమీక్షిస్తుంది" అని హోండా తమ ప్రకటనలో పేర్కొంది.

హోంటా టూవీలర్స్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో, కొనుగోలుదారులు సులభంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి వీలుగా హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కొత్త ఫైనాన్స్ స్కీమ్ను మరియు తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

కొత్తగా హోండా టూవీలర్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. హోండా కేవలం 6.5 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా, ఏదైనా హోండా బైక్ లేదా స్కూటర్ను లోన్ ద్వారా కొనుగోలు చేసే వారికి కంపెనీ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఫీజు మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీల నుండి మినహాయింపు అందిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








